హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఐటీ కంపెనీల్లో హైబ్రిడ్ వర్కింగ్ విధానానికే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. కరోనా థర్డ్వేవ్ తర్వాత ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని క్రమంగా తగ్గిస్తూ రిటర్న్ టు ఆఫీస్ విధానాన్ని పాటిస్తున్నాయి. పలు కంపెనీలు అంతర్గత సమాచారాన్ని అందించడంతో ఏప్రిల్ నుంచి ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్తున్నారు. అలా మొదలైన ఐటీ ఉద్యోగుల పని విధానంలో పలు మార్పులు చోటు చేసుకొంటున్నాయి. మే, జూన్ నుంచి ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వచ్చి పనిచేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.
జూలై నాటికి 60-80 శాతం ఉద్యోగులు ఆఫీసుకే వచ్చి పనిచేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకొన్నారు. తాజాగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మళ్లీ ఐటీ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఐటీ ఉద్యోగులతో పనిచేయించుకొనే విధానంపై పునరాలోచనలో పడ్డాయి. తొందరపాటు కాకుండా పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. దేశంలోనే అత్యధికంగా బెంగళూరులో 10 లక్షలపైనే ఐటీ ఉద్యోగులు పనిచేస్తుండగా, ఆ తర్వాతి స్థానంలో హైదరాబాద్లో సుమారు 7 లక్షల మంది పనిచేస్తున్నారు. ప్రపంచ దిగ్గజ ఐటీ కంపెనీల కార్యాలయాలు ఇక్కడే ఉండటంతో ఒక్కో కంపెనీలో వేల మంది పనిచేస్తున్నారు.
ఆఫీస్ స్పేస్ విషయంలో తర్జన భర్జన
చాలా ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పనిచేయాలని ఇప్పటికే ఈమెయిల్స్ ద్వారా సమాచారం ఇచ్చాయి. ఇందుకు రెండు నుంచి మూడు నెలల గడువు విధించాయి. ఏప్రిల్ నుంచే ఈ విధానం ప్రారంభం కాగా, దానికి అనుగుణంగా ఆఫీస్ స్పేస్ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బహుళ జాతీయ ఐటీ కంపెనీల్లో ఒకేసారి వేల మంది ఒకే కార్యాలయంలో పనిచేస్తుంటారు. అలాంటి వారికి సీటింగ్ సౌకర్యాన్ని కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలంటే ఎక్కువ స్థలంతోపాటు అదే స్థాయిలో ఇతర ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
దీనికి బదులుగా షిప్టులవారీగా తక్కువ స్పేస్లోనే ఉద్యోగులందరితోనూ పనిచేయించుకొనే దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకొంటున్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్న మైక్రోసాఫ్ట్, గూగుల్, ఇన్ఫోసిస్, అసెంచర్, ఒరాకిల్, టెక్ మహీంద్రా, డెలాయిట్ ఇలా మల్టీ నేషనల్ కంపెనీల్లో లక్షల మంది పనిచేస్తున్నారు. కరోనా సమయంలో కొన్ని ఐటీ కంపెనీలు ఆఫీస్ స్పేస్ను తగ్గించి, పరిమిత విస్తీర్ణంలోనే కార్యకలాపాలను నిర్వహించాయి. మళ్లీ ఉద్యోగులు తిరిగి వస్తున్న నేపథ్యంలో ఆఫీస్ స్పేస్ను సిద్ధం చేసేందుకు కొన్ని కంపెనీలకు చాలా సమయమే పడుతుంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని హైబ్రిడ్ వర్కింగ్ విధానం అమలు చేయడం వల్ల అటు కంపెనీకి, ఇటు ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని భావించి నిర్ణయాలు తీసుకొంటున్నాయి.