శ్రీశైలం : కృష్ణా నదీ వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువ నుంచి దిగువ ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద వచ్చి చేరుతున్నది. శ్రీశైలం ప్రాజెక్టులో గంట గంటకు పెరిగి జలాశయం నిండుకుండలా మారింది. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి ప్రస్తుతం 3లక్షల క్యూసెక్కులకుపైగా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్నది. దీంతో అధికారులు జలాశయం పదిగేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు గేట్లద్వారా 1,66,624 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా ద్వారా 27,212 క్యూసెక్కులు ఇన్ఫ్లో వస్తున్నది.
అలాగే సుంకేశుల నుంచి 66,176 క్యూసెక్కులు, హంద్రీ నుంచి 117 క్యూసెక్కులు వస్తుండగా.. సాయంత్రానికి 3.30లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో రికార్డయినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం జలాశయం నుంచి 2.79లక్షల క్యూసెక్కులను దిగువకు వదులున్నామని.. కుడి, ఎడమగట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని అధికారులు వివరించారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.70 అడుగులున్నది. పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.807టీఎంసీలు కాగా.. 213.88 టీఎంసీలుగా ఉన్నది.