శ్రీశైలం : ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతున్నది. ప్రస్తుతం 3,05,990 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో అధికారులు వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. 3.77 లక్షల క్యూసెక్కుల వరద దిగువకు వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా 883.90 అడుగుల మేర నీరున్నది.
జలాశయం పూర్తిస్థాయి నీటిసామర్థ్యం 215 టీఎంసీలు కాగా 209.5948 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు వివరించారు. కుడి, ఎడమ గట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది. ఏపీ పవర్ హౌస్ ద్వారా 30,370, తెలంగాణ పవర్ హౌస్ ద్వారా 36,897 క్యూసెక్కులు దిగుకు వెళ్తుందని, హెచ్ఎన్ఎస్ఎస్కు 527, ఎంజీకేఎల్ఐకు 800 క్యూసెక్కులు, పీఆర్పీకి 10వేల క్యూసెక్కుల విడుదల చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. స్పిల్వే మార్గం ద్వారా 2,99,296 క్యూసెక్కుల సాగర్ వైపుగా వెళ్తుందని అధికారులు వివరించారు.
నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి భారీగా వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం జలాశయానికి 1.80లక్షల ఇన్ఫ్లో వస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం 1.97లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం 587 అడుగుల మేర నీరుండగా.. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 కాగా.. ప్రస్తుతం జలాశయంలో 305 టీఎంసీల మేర నీరున్నది. ప్రస్తుతం పది గేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు.