మెండోరా, జూలై 18: ఎగువ మహారాష్ట్ర, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎస్సారెస్పీలోకి భారీగా వరద వచ్చి చేరుతున్నదని ప్రాజెక్టు ఏఈఈ వంశీ సోమవారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి 92,350 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నదని పేర్కొన్నారు. భారీగా వరద వచ్చి చేరుతుండడంతో ఉదయం 8 గంటలకు 9 వరదగేట్లను ఎత్తి 25 వేల క్యూసెక్కులను దిగువ గోదావరిలోకి విడుదల చేసినట్లు తెలిపారు. వరద ఉధృతి పెరుగుతండడంతో 12.30 గంటలకు 26 వరద గేట్లను ఎత్తి 99,940 క్యూసెక్కుల మిగులు జలాలను దిగువ గోదావరిలోకి విడుదల చేశామన్నారు.
ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 2,500 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 3,500 క్యూసెక్కులు, వరదకాలువకు 15,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు (90.313 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1088.30 అడుగుల (77.383 టీఎంసీలు) వద్ద ఉన్నదని పేర్కొన్నారు. ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 144.250 టీఎంసీల వరద వచ్చి చేరిందన్నారు. కాలువలు, గోదావరిలోకి 86.936 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసినట్లు ఏఈఈ వివరించారు.
12 టీఎంసీలకు చేరిన నిజాంసాగర్ నీటిమట్టం
నిజాంసాగర్, జూలై18: కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతం నుంచి 15.300 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1405.00 అడుగులు (17.80 టీఎంసీలు) కాగా సోమవారం సాయంత్రానికి 1400. 67 అడుగుల (12.08 టీఎంసీలు) వద్ద ఉన్నదని ప్రాజెక్టు ఏఈ శివకుమార్ తెలిపారు.