హైదరాబాద్: కృష్ణానదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతున్నది. ఎగువనుంచి జూరాల జలాశయానికి 1,45,000 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి 1,39,590 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల పూర్తిస్థాయిలో 318 అడుగుల నీటిమట్టం ఉన్నది.
శ్రీశైలం ప్రాజెక్టుకు 1,69,206 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 4 గేట్లను 10 అడుగుల మేరఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు నుంచి మొత్తం 1,75,043 క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తున్నది. స్పిల్వేద్వారా 1.11 లక్షలు, విద్యుదుత్పత్తి ద్వారా 63,295 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 884.70 అడుగులుగా ఉంది. జలాశయంలో ఇప్పుడు 213.88 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతున్నది.
ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు 1.62 లక్షల క్యూసెక్కుల నీరు వస్తున్నది. అంతేమొత్తంలో దిగువకు వెళ్తున్నాయి. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 59 అడుగులు. ప్రస్తుతం 587.60 అడుగుల వద్ద నీరు ఉన్నది. ప్రాజెక్టు గరిష్ట నీటినిల్వ 312.04 టీఎంసీలుకాగా, ఇప్పుడు 305.87 టీఎంసీలుగా ఉంది.