యాదాద్రి, ఆగస్టు 13: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం శనివారం భక్తులతో సందడిగా మారింది. వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో క్యూ కాంప్లెక్స్, మాడ వీధులు రద్దీగా కనిపించాయి. అష్టభుజి ప్రాకారం నుంచి త్రితల రాజగోపురం వరకు క్యూ లైన్ భక్తులతో నిండిపోయింది. ప్రసాద విక్రయశాల, శివాలయ ప్రాంగణమంతా సందడిగా కనిపించింది. స్వామి, అమ్మవార్ల తిరుకల్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
వీఐపీ దర్శనానికి గంట, ధర్మదర్శానికి 2 గంటల సమయం పట్టినట్టు భక్తులు వెల్లడించారు. కాగా శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన 16వ రోజుకు చేరింది. సుమారు 25 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకొన్నారని ఈవో గీత తెలిపారు. ఖజానాకు రూ.23,37,923 ఆదాయం సమకూరినట్టు ఆమె పేర్కొన్నారు. కాగా స్వామివారి తీర్థ ప్రసాదం శనివారం ప్రారంభమైంది.