శ్రీశైలం : జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠమైన శ్రీశైల క్షేత్రం భక్తులతో కిటకిలలాడింది. కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా పెద్ద సంఖ్యలు భక్తులు తరలివచ్చి భ్రమరాంబ మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు. ఈ మేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి భక్తులు పాతాళగంగ, పుష్కరిణిలో స్నానాలు చేసి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం బారులు తీరారు.
సాంప్రదాయ దుస్తులు ధరించి సామూహిక అభిషేకాలు, కుంకుమార్చనలు, వృద్ధ మల్లికార్జున స్వామికి బిల్వార్చన తదితర పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఈవో లవన్న తెలిపారు. వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులకు గురవగా.. ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే అన్నదాన భవనాల్లో విడతల వారీగా అల్పాహార భోజన సదుపాయాలు కల్పించినట్లు చెప్పారు. సాయంత్రం దక్షిణ మాడవీధిలో నిత్య కళారాధన వేదికపై నిర్వహించిన చిన్నారుల ప్రదర్శనలు అలరించాయి.
అన్నదానానికి భక్తుల విరాళం
శ్రీశైల దేవస్థానం భక్తుల సౌకర్యార్థం నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. హైదరాబాద్ నిజాంపేటకు చెందిన లక్ష్మీపతి దంపతులు, సంగారెడ్డి జిల్లాకు చెందిన వీరశెట్టేశ్వర స్వామి, తూర్పుగోదావరి జిల్లా చెయ్యూరుకు చెందిన నాగేంద్రరావు ఆలయ పర్యవేక్షకులను కలిసి చెక్కు రూపంలో విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారికి స్వామి అమ్మవార్ల వారి దర్శనం చేయించి, తీర్థ ప్రసాదాలు అందించారు.