అహ్మదాబాద్ : గుజరాత్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పంజాబ్ పోలీసులతో కలిసి గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జాయింట్ ఆపరేషన్లో ముంద్రా పోర్ట్ నుంచి 75.3 కోట్ల విలువైన హెరాయిన్ను సీజ్ చేశారు. పంజాబ్కు తరలించేందుకు కంటైనర్లో సిద్ధంగా ఉంచిన డ్రగ్స్ను ఈ ఆపరేషన్లో స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ 376 కోట్లుగా అధికారులు అంచనా వేశారు.
పంజాబ్కు తరలించేందుకు ముంద్రా పోర్టులో కంటైనర్ సిద్ధం చేశారని, ఇందులో డ్రగ్స్ తరలించే అవకాశం ఉందని పంజాబ్ పోలీసులు గుజరాత్ ఏటీఎస్కు సమాచారం అందించడంతో ఈ ఆపరేషన్ను చేపట్టారు. అధికారులు మంగళవారం అనుమానిత కంటైనర్లో సోదాలు చేపట్టగా దిగుమతి చేసుకున్న దుస్తులు కనిపించాయి. ఆపై కంటైనర్ను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్టాయి.
కార్డ్బోర్డ్ పైప్లో పేపర్లు చుట్టి ఎక్స్రే స్కానింగ్ కండ్లు కప్పి డ్రగ్స్ తరలించేందుకు నిందితులు స్కెచ్ వేసినట్టు గుర్తించారు. ఇతర దేశాల నుంచి గుజరాత్ పోర్టులకు ఇటీవల పెద్ద ఎత్తున షిప్పింగ్ కంటైనర్లలో డ్రగ్స్ వస్తున్న ఘటనలు పెచ్చుమీరాయి. గత ఏడాది సెప్టెంబర్లో రెండు కంటెయినర్లలో ముంద్రా పోర్టుకు వచ్చిన 3000 కిలోల విలువైన హెరాయిన్ను డీఆర్ఐ సీజ్ చేసింది. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ 21,000 కోట్లు ఉంటుందని అప్పట్లో అధికారులు లెక్కకట్టారు.