Ram Pothineni | ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మూడేళ్ల కింద అదిరిపోయే బ్లాక్బస్టర్ అందుకున్నాడు రామ్ పోతినేని. ఆ సినిమాతో ఏకంగా 40 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయాడు. అప్పటివరకు ఆయన మార్కెట్ కేవలం 25 కోట్లు మాత్రమే. కానీ పర్ఫెక్ట్ మాస్ సినిమా వచ్చేసరికి ఒకేసారి రూ.15 కోట్లు అదనంగా వచ్చాయి. కానీ ఆ తర్వాత చేసిన రెడ్ కేవలం 20 కోట్ల దగ్గర ఆగిపోయింది. దీన్ని బట్టి రామ్ మార్కెట్ ఇంకా పూర్తిస్థాయిలో పెరగలేదు అనే విషయం అర్థం అవుతుంది. తాజాగా ఈయన ది వారియర్ అంటూ మరోసారి అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్తో వస్తున్నాడు.
మాస్ సినిమాల స్పెషలిస్ట్ లింగుస్వామి తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. జూలై 14న తెలుగు, తమిళంలో ఒకేరోజు విడుదల కానుంది ఈ సినిమా. యంగ్ సెన్సేషనల్ బ్యూటీ కృతి శెట్టి ఇందులో హీరోయిన్గా నటించింది. ఇప్పటివరకు విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే అంతా బాగానే ఉంది కానీ ఈ సినిమా టికెట్ రేట్ల విషయంలో సరికొత్త చర్చ మొదలైంది. ఈ మధ్య కాలంలో ఎక్కువగా 200 రూపాయల మల్టీప్లెక్స్ టికెట్తోనే వస్తున్నారు మీడియం రేంజ్ హీరోలు. నాని లాంటి క్రేజీ హీరో కూడా అంటే సుందరానికి సినిమాకు 250 రూపాయల వరకు మాత్రమే ధైర్యం చేయగలిగాడు. కానీ ఇప్పుడు వారియర్ సినిమా 295 రూపాయల మల్టీప్లెక్స్ టికెట్తో వస్తుంది.
చివరగా ఈ టికెట్ ధరతో తో వచ్చిన సినిమా ఎఫ్ 3. కుటుంబ ప్రేక్షకులు ఈ సినిమాకు వెళ్లాలని కోరిక ఉన్నా కూడా టికెట్ రేట్ కారణంగా వెనక్కి తగ్గారు. ఇలాంటి సమయంలో రామ్ నిర్మాతలు ఈ సినిమాకు 295 రూపాయల టికెట్ ఫిక్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో 295 రూపాయలు.. ఏపీ మల్టీప్లెక్స్ లో 177 రూపాయల టికెట్ తో వారియర్ సినిమా విడుదలవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో దృష్ట్యా ఇంత టికెట్ రేట్ పెడితే ప్రేక్షకులు వస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు వర్షాలు కూడా సినిమాలకు అడ్డంకిగా మారాయి. మరి వీటన్నింటికి దాటుకొని రామ్ ఎంతవరకు విజయం సాధిస్తాడనేది చూడాలి.
Ram Interview | కృతి శెట్టి గురించి రామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆమెకు అది చాలా ఎక్కువ