వ్యవసాయ యూనివర్సిటీ :వ్యవసాయ యూనివర్సిటీలో టీ అగ్రిహబ్ ప్రారంభం సందర్భంగా మంత్రి కేటీఆర్ విద్యార్థులతో ప్రత్యేకంగా ముచ్చటించారు.స్టాల్స్ వద్దకు మంత్రి కేటీఆర్ చేరగానే నేతలు, అధికారులు , స్టాల్స్ , సంస్థల యజమానులు వాటి గురించి వివరించేందుకు గుమిగూడారు. అప్పటికే అగ్రికల్చర్ బిఎస్సీ చదువుతున్న విద్యార్థులు పక్కన నిలబడగా మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని ఇక్కడ సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు మాత్రమే ముందుకు రావాలి, ఈ హబ్ వారికి ఎలా ఉపయోగ పడుతుందో అంటూ, అటుగా ఉన్న విద్యార్థులను పిలిచి ప్రతి స్టాల్ వద్ద సుదీర్ఘంగా చర్చించారు .
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు .సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ చేపడుతున్న ప్రతి ప్రణాళికా అందరికీ చేరాలి. అంటూ విద్యార్థులతో వాటి ఉపయోగాలను తెలుసుకున్నారు. అగ్రి బిఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న హిమబిందు మాట్లాడుతూ సర్ ఈ యూనివర్సిటీలో చదవడం నా అదృష్టంగా భావిస్తున్నాను, మా ప్రాంతంలో కూడా అందరూ నన్ను గౌరవంగా చూస్తున్నారు. నాన్నకు సాగులోని మెలకువలు చెబుతుంటే లోలోనే మురిసిపోతున్నారు. మా పంటలు చాలా బాగున్నాయి. మా పల్లెలో నాన్నతో పాటు సమీప రైతులంతా సాగు ముచ్చట్లు విన్నారు . తరగతి గదులకే పరిమితం కాకుండా రెండవ ఏడాది నుంచే పొలాలలో వెళ్లే పరిస్థితి కొవిడ్ కల్పించిందని మరో విద్యార్థి మంత్రి దృష్టికి తెచ్చారు.
ఇలా విద్యార్థులు ఒక్కొక్కరూ ముందుకొచ్చి తమ సాగు ముచ్చట్లు మంత్రులకు చెప్పడంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. మారుమూల గ్రామాల నుంచి వచ్చిన రైతు బిడ్డలే ఎక్కువగా ఉండడంతో ఇ లాంటి వారి వల్లే త్వరగా రైతుకు మంచి సమాచారం, టెక్నాలజీ అందుతుందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.