కోయంబత్తూర్ : తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్కు చెందిన హోటల్ యజమానిని రూ 80 లక్షలకు మోసం చేసిన నిందితుడిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని బెంజ్ వెకేషన్స్ క్లబ్ ప్రొప్రైటర్ శరవణన్గా గుర్తించారు.
ఆల్ఫా హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అధిపతి శబరి గణేష్ 2018లో చెన్నైలో రెస్టో బార్ను ఓపెన్ చేయాలని యోచిస్తుండగా తన వద్ద రెస్టో బార్ లైసెన్స్ ఉందని శరవణన్ ఆయనను సంప్రదించాడు. వెల్లింగ్టన్ ప్లాజాలోని తన ప్రాంగణాన్ని వాడుకోవాలని శబరి గణేష్ను కోరాడు. ఈ దిశగా ఇద్దరూ ఒప్పందం చేసుకోగా పలు దశల్లో నిందితుడికి శబరి గణేష్ రూ 80 లక్షలు చెల్లించాడు.
డబ్బు చెల్లించినా రెస్టో బార్ను సిద్ధం చేయకపోవడంతో తన డబ్బును తిరిగిఇవ్వాలని గణేష్ కోరాడు. డబ్బు తిరిగి ఇచ్చేందుకు నిందితుడు నిరాకరించడంతో గణేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు శరవణన్ను అరెస్ట్ చేశారు.