న్యూఢిల్లీ : దేశంలో బొగ్గు కొతర, విద్యుత్ సంక్షోభం భయాల మధ్య కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సోమవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్, బొగ్గుశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీతో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అధికారులు సైతం సమావేశానికి హాజరయ్యారు. బొగ్గు కొరత దృష్ట్యా అనేక రాష్ట్రాలు విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగే అవకాశం ఉందని హెచ్చరించాయి. అయితే, విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల డిమాండ్కు సరిపోయేంత బొగ్గు దేశంలో అందుబాటులో ఉందని కోల్ మినిస్ట్రీ చెబుతున్నది. దేశంలో విద్యుత్ సరఫరాకు అంతరాయంపై వస్తున్న వార్తలు తప్పని మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. ఇదిలా ఉండగా.. బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా 13 థర్మల్ విద్యుత్ ప్లాంట్లు ఆదివారం మూతపడ్డాయి.