కొడంగల్ : ఇంటి ఆవరణలో జామ, మామిడి, నారింజ, సపోట వంటి పండ్ల మొక్కలను విరివిగా పెంచుకోవడాన్ని మనం చూస్తుంటాము. ద్రాక్ష పండ్ల పెంపకం పంటపొలాల్లో పందిరి వేసి సాగు చేస్తుంటారు. కానీ కొడంగల్ పట్టణానికి చెందిన సుదర్శన్ (సీఆర్పీఎఫ్ జవాన్) తన ఇంట్లో ద్రాక్ష తీగను పెంచుతున్నారు. ద్రాక్ష తీగ ఇంటి ఆవరణలో పెంచుకోవడం చాలా అరుదుగా చూస్తుంటాము.
ద్రాక్ష తీగను పెంచుకోవడానికి పందిరి చేయడంతో పాటు ప్రత్యేకంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సుదర్శన్ గత రెండెళ్లుగా ద్రాక్ష తీగను ఇంటి ముంగిట పెంచుకొంటున్నారు. ఈ సంవత్సరం గుత్తులు గుత్తులుగా ద్రాక్షపండ్లు కాయడంతో ఆనందం వ్యక్తం చేశారు. ద్రాక్ష తీగకు ఎటువంటి క్రిమి సంహార మందులు వాడలేదని, తీగను శ్రద్ధతో కాపాడుకొంటూ వస్తున్నట్లు తెలిపారు. ద్రాక్ష పండ్లు కాయడంతో పాటు ఇంటి ముందు పచ్చటి పందిరి నీడ ఏర్పడిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. చెట్లును మనం కాపాడుకుంటే అవి తప్పకుండా ఫలాలను అందిస్తాయని తెలిపారు.
ద్రాక్షతో పాటు ఇంటి ఆవరణలో నల్లనేరేడు, చిక్కుడు వంటి కూరగాలయను ఇష్టంగా పెంచుకొంటున్నట్లు తెలిపారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అప్పట్లో ద్రాక్ష తోటలు చాలా ఉండేవి, నేటి రోజుల్లో రైతులు ద్రాక్షతోటను పండించడంలో ఆసక్తిని కనబరచడం లేదని ఆయన తెలిపారు. ఈ చుట్టు ప్రక్క ప్రాంతంలో మా ఇంట్లోనే ద్రాక్ష తీగ ఉన్నట్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు.