షిమ్లా : హిమాచల్ప్రదేశ్ కన్నౌర్ జిల్లాలో కొండచరియలు విరిగి వాహనాలపై పడిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 13కు పెరిగింది. ప్రస్తుతం ఇంకా అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది మృతి చెందారని, 40 మంది గల్లంతయ్యారని, 14 మంది క్షతగాత్రులను రక్షించినట్లు పేర్కొన్నారు. మృతుల్లో చిన్నారి సహాయ ఐదుగురు మహిళలు ఉన్నారు.
బుధవారం ఉదయం నేషనల్ కన్నౌర్ జిల్లాలోని రెహ్లాన్ – సియో హైవేపై వెళ్తున్న సమయంలో టన్నుల కొద్దీ బరువున్న బండరాళ్లు ఎత్తయిన కొండపై నుంచి దొర్లుకుంటూ వచ్చి రోడ్డుపై నుంచి వెళ్తున్న వాహనాలపై పడిపోయిన విషయం తెలిసిందే. వెంటనే స్పందించిన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. రాత్రి 9 గంటల వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగించగా.. టిప్పర్, రెండు కార్లు, సుమోను వెలికి తీశారు. మహిమాచల్ప్రదేశ్ ఆర్టీసీకి చెందిన బస్సును ఇంకా గుర్తించాల్సి ఉంది. పగటి పూట డ్రోన్లసహాయంతో బస్సు జాడ కోసం అన్వేషించినా ఫలితం లేకుండా పోయింది.
రాత్రి సమయంలో సట్లెజ్ నది వద్ద వెతికినా జాడ కనిపించలేదు. బస్సు మొదట.. మూరాంగ్ నుంచి రేకాంగ్ పియోకు చేరింది. అక్కడ పలువురు ప్రయాణికులు ఎక్కిన తర్వాత హరిద్వార్కు బయలుదేరింది. బస్సులో దాదాపు 22 మంది వరకు ఉన్నట్లు సమాచారం. ఆర్మీ, ఐటీబీపీకి చెందిన బలగాలు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు చెందిన 200 మంది జవాన్లు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాదంలో మృతిచెందిన వారికి రూ.2లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ.50వేల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.