పరిగి, ఆగస్టు 14 : జిల్లాలో ఈ నెల 16న ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా 1600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నామని.. అలాగే 7 స్పెషల్ పార్టీలు సైతం బందోబస్తులో పాల్గొంటారని వికారాబాద్ ఎస్పీ ఎన్.కోటిరెడ్డి తెలిపారు. ఆదివారం వికారాబాద్లోని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రషీద్తో కలిసి ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా బందోబస్తు కోసం వికారాబాద్ జిల్లా పరిధిలోని పోలీసు సిబ్బందితోపాటు మహబూబ్నగర్, గద్వాల్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట్, నల్గొండ, సూర్యాపేట్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుంచి నలుగురు ఎస్పీలు, 6 మంది అదనపు ఎస్పీలు, 14 మంది డీఎస్పీలు, 63 మంది సీఐలు, 146 మంది ఎస్ఐలు, ఇతర సిబ్బంది మొత్తం 1600 మంది బందోబస్తులో పాల్గొంటారన్నారు. 7 స్పెషల్ పార్టీలు సైతం ఈ బందోబస్తులో పాల్గొంటారని చెప్పారు. సీఎం వచ్చే రూట్లో రూఫ్ టాప్లు, డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలను ఏర్పాటుచేసి గట్టి నిఘాను ఏర్పాటు చేయనున్నామని ఎస్పీ చెప్పారు.
ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాలు
ఎస్పీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్లో ల్యాండ్ అయిన తర్వాత సీఎం నేరుగా టీఆర్ఎస్ భవన్కు వెళ్లి ప్రారంభోత్సవం చేస్తారని ఎస్పీ చెప్పారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా ఎమ్మెల్యే నివాసానికి వెళ్తారని.. ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని చెప్పారు. అక్కడి నుంచి నేరుగా ఎన్నెపల్లిలోని సమీకృత జిల్లా కలెక్టరేట్కు చేరుకొని నూతన కలెక్టరేట్ను ప్రారంభిస్తారని తెలిపారు. అనంతరం కొత్త కలెక్టరేట్లో సీఎం అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని, అనంతరం బహిరంగసభలో పాల్గొంటారన్నారు. సభ ముగిసిన తర్వాత నేరుగా హెలిప్యాడ్ వద్దకు వచ్చి హెలికాప్టర్లో హైదరాబాద్కు బయలుదేరి వెళ్తారని.. ఆలస్యమైతే ఎన్నెపల్లి, మన్నెగూడ మీదుగా రోడ్డు మార్గంలో హైదరాబాద్ వెళ్తారని ఎస్పీ చెప్పారు. సీఎం పర్యటన సందర్భంగా సమావేశానికి వచ్చే వీవీఐసీ, వీఐపీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారందరూ తమకు జారీ చేసిన పాస్లను తప్పనిసరిగా తీసుకురావాలని ఆయన సూచించారు. పాస్లు లేనివారికి అనుమతి లేదన్నారు. సీఎం పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా చర్యలు
ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమం రోజు జిల్లా ప్రజలకు, నాయకులకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా జిల్లాలో ట్రాఫిక్ మళ్లింపు చేపట్టనున్నామని ఎస్పీ పేర్కొన్నారు. 16న సీఎం పర్యటన సమయానికి 2 గంటల ముందు పరిగి, నస్కల్ వైపు నుంచి వికారాబాద్కు వచ్చే వాహనాలకు ఎలాంటి ప్రవేశం లేదన్నారు. హైదరాబాద్ నుంచి తాండూరు వచ్చే వాహనాలను మన్నెగూడ మీదుగా మళ్లించనున్నామని ఎస్పీ తెలిపారు. పార్కింగ్కు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ చెప్పారు. ఆలంపల్లి, నవాబుపేట, తాండూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు ఎన్టీఆర్ క్రాస్రోడ్డు మీదుగా ఎన్నెపల్లి క్రాస్రోడ్డు నుంచి భృంగీ స్కూల్ లే అవుట్, ఎల్లమ్మ, చెన్నమ్మ తోటల్లో పార్కింగ్ కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చేవెళ్ల నుంచి మన్నెగూడ మీదుగా వచ్చే వాహనాలకు మహావీర్ హాస్పిటల్ వైపు నుంచి సూర్యప్రకాశ్నగర్, టీచర్స్ కాలనీలలో పార్కింగ్ కల్పించబడిందని చెప్పారు. కొడంగల్, పరిగి, నస్కల్ వైపు నుంచి వచ్చే వాహనాలకు డీటీసీ, జిల్లా పరిషత్ కొత్త భవనం ఏరియా, పాత హెలీప్యాడ్లలో పార్కింగ్ కోసం స్థలం కేటాయించినట్లు పేర్కొన్నారు. ముఖ్యమైన నాయకులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్పర్సన్లకు నూతన కలెక్టరేట్ దగ్గరలో గల వెంచర్ను పార్కింగ్ కోసం ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. నాయకులు, ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటించాలని ఎస్పీ సూచించారు.
ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్రెడ్డి
సీఎం పర్యటన ప్రదేశాలు, ఏర్పాట్ల పరిశీలన
వికారాబాద్లో నిర్మించిన కలెక్టర్ కార్యాలయం, టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం, ఎస్పీ కార్యాలయం వద్ద పెరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న ఏర్పాట్లను ఆదివారం ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆనంద్, మహేశ్రెడ్డి పరిశీలించారు. 16న కలెక్టరేట్, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారని.. అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాలు, మరికొన్ని కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని.. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు. సీఎం కేసీఆర్ పర్యటించే రోడ్డు మార్గాలు, జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం(నూతన కలెక్టరేట్), వికారాబాద్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డి, వికారాబాద్ పట్టణ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.