డోర్నకల్ నుంచి జనగామ దాకా స్టేషన్లలో అలర్ట్..
భారీగా మోహరించిన పోలీసులు
రైళ్ల రాకపోకలకు అడ్డంకులు..
ప్రయాణికుల అగచాట్లు
సైనిక నియామకాల కోసం కేంద్ర సర్కారు కొత్తగా తెచ్చిన ‘అగ్నిపథ్’ పథకం యువతలో ఆందోళనలకు ఆజ్యం పోసింది. అన్ని రాష్ర్టాలూ నిరసనలతో అట్టుడుకుతుండగా, ఈ ప్రభావం ఉమ్మడి జిల్లాపైనా పడింది. సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోని డోర్నకల్ నుంచి జనగామ దాకా ఉన్న రైల్వే స్టేషన్లలో పోలీసులు భారీగా మోహరించారు.
వరంగల్, జూన్ 17(నమస్తే తెలంగాణ ప్రతినిధి): సైనిక నియామకాల కోసం కేంద్రం తెచ్చిన ‘అగ్నిపథ్’ విధానంపై యువత, ఉద్యోగార్థులు మండిపడుతున్నారు. నాలుగేళ్ల సర్వీస్ నిర్ణయం సరికాదని నిరసన తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఆర్మీ అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగి రణరంగం కావడం, ఖానాపురం మండలానికి చెందిన యువకుడు చనిపోవడంతో పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. రైల్వే స్టేషన్లు, లైన్లపై ఎలాంటి ఘటనలు జరగకుండా పహారా కాస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని జనగామ నుంచి మొదలు డోర్నకల్ దాకా ఉన్న స్టేషన్లలో పోలీసులు మోహరించారు. కాజీపేట జంక్షన్, వరంగల్ స్టేషన్లో వేలాది మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
సికింద్రాబాద్ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి ఆధ్వర్యంలో పటిష్ట చర్యలు చేపట్టారు. ‘అగ్నిపథ్’ విధానంతో శాశ్వత ఉద్యోగాలు కాకుండా నాలుగేండ్లకు పరిమితమైన పోస్టులే ఉంటాయని, తమ భవిష్యత్ అయోమయంలో పడుతుందని యువకులు వాపోతున్నారు. పూర్తి స్థాయి కెరియర్గా ఎంపిక చేసుకుని కష్టపడుతున్న తమలో ‘అగ్నిపథ్’తో అయోమయం నెలకొన్నదని చెబుతున్నారు. ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా అగ్నిపథ్ విధానానికి వ్యతిరేకంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. దీనిని వెంటనే రద్దు చేయాలని హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, జయశంకర్భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల నేతలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
రైళ్ల రాకపోకలకు అడ్డంకులు..
ఖిలావరంగల్/నెక్కొండ: సికింద్రాబాద్ ఘటన ప్రభావం కాజీపేట, వరంగల్, నెక్కొండ, డోర్నకల్ రైల్వే స్టేషన్లపైనా పడింది. సికింద్రాబాద్ నుంచి రావాల్సిన రైళ్లు ఆగిపోయాయి. కాజీపేట మీదుగా ఢిల్లీకి వెళ్లే రైళ్లు సైతం నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రైళ్లరద్దుతో కాజీపేట, వరంగల్ స్టేషన్ల నుంచి చాలా మంది వెనుదిరిగిపోవడం కనిపించింది. డోర్నకల్, వరంగల్ మీదుగా ఢిల్లీ రూట్లో భద్రత చర్యల మధ్య రైళ్లు రాకపోకలు సాగించాయి. కాజీపేట మీదుగా సికింద్రాబాద్, వరంగల్, ఢిల్లీ మార్గాల్లో రోజూ 120 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. సికింద్రాబాద్-కాజీపేట మధ్య యథాతథ స్థితికి ఎప్పుడు వస్తుందోనని ఆందోళన నెలకొంది. ఎక్కడా ప్రతికూల ఘటనలు జరగకుండా పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.