హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): కుటుంబ పెద్ద సర్వీస్లో ఉండగా మరణిస్తే అతని కుమార్తెలు కూడా కారుణ్య నియామానికి అర్హులేనని హైకోర్టు ప్రకటించింది. కుమార్తెలు అర్హులేనని గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావిస్తూనే దరఖాస్తును రంగారెడ్డి జిల్లా జడ్జి తోసిపుచ్చడాన్ని ధర్మాసనం తప్పుపట్టింది. జిల్లా జడ్జి ఉత్తర్వులను రద్దుచేస్తూ బుధవారం ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ కారుణ్య నియామక దరఖాస్తును నాలుగువారాల్లోగా చట్టప్రకారం పరిష్కరించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లి, జస్టిస్ బీ విజయ్సేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. రంగారెడ్డి జిల్లా కోర్టులో ఓ ఉద్యోగి సర్వీస్లో ఉండగా మరణించగా అతని భార్య స్వరూపకు కారుణ్య నియామకం కింద ఉద్యోగమిచ్చారు. కొంతకాలానికి స్వరూప కూడా సర్వీస్లో ఉండగానే మరణించటంతో ఆమె కుమార్తె బండారి దివ్య కారుణ్య నియామకానికి చేసుకున్న దరఖాస్తును జిల్లా జడ్జి తిరస్కరించారు. దీంతో ఆమె హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది.