IT Dept on Hero Moto | దేశంలోనే అతిపెద్ద టూ వీలర్ల తయారీసంస్థ హీరో మోటో కార్ప్స్ నిధులు దారి మళ్లించిందని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ పేర్కొంది. అక్రమ వ్యాపార ఖర్చుల పేరిట రూ.800 కోట్లు దారి మళ్లించిందని తమ దర్యాప్తులో తేలినట్లు తెలిపింది. వ్యాపార ప్రయోజనాల కోసం ఖర్చు చేసినట్లు చూపినా.. అందుకు తగిన ఆధారాలు హీరో మోటో కార్ప్స్ యాజమాన్యం ఇవ్వలేకపోయిందని వివరించింది. ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ నుంచి సర్వీసుల కొనుగోలు కోసం రూ.800 కోట్లు ఖర్చు చేసినట్లు హీరో మోటో కార్ప్స్ చూపుతున్నది. ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ ద్వారా నిధుల మళ్లింపు జరిగిందని ఐటీ శాఖ అనుమానిస్తున్నది.
గత నెల 23న హీరో మోటో కార్ప్స్ సీఈవో కం ఎండీ పవన్ ముంజాల్తోపాటు ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని పలు సంస్థ కేంద్రాలు, కార్యాలయాలు, కీలక అధికారుల ఇండ్లలో ఐటీ అధికారులు సోదాలు జరిపారు. హీరో మోటో కార్ప్స్ పన్ను ఎగవేతకు పాల్పడిందని ఐటీ శాఖ ఆరోపిస్తున్నది. ఢిల్లీ-ఎన్సీఆర్ కేంద్రంగా పని చేస్తున్న ఓ రియాల్టీ సంస్థతోపాటు హీరో మోటో కార్ప్స్ చార్టర్డ్ విమానాలను నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ సోదాల్లో లభించిన కీలక ఆధారాలు, డిజిటల్ సాక్ష్యాలను జప్తు చేసినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. వ్యాపార లావాదేవీల కోసం ఈ నిధులు ఖర్చు చేసినట్లు స్పష్టంగా చూపుతున్నా.. అందుకు మద్దతు తెలిపే ఆధారాల్లేవని స్పష్టం చేసింది.
డొల్ల కంపెనీల ద్వారా ఢిల్లీలో 10 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు తమ సోదాలో తేలిందని ఐటీ శాఖ వివరించింది. ఇందులో రూ.60 కోట్లకు పైగా లెక్కకు రాని లావాదేవీలు ఉన్నాయి. ఈ భూమి కొనుగోల ద్వారా హీరో మోటో కార్ప్స్ గ్రూప్లో ప్రముఖ వ్యక్తికి లబ్ధి చేకూరింది. చార్టర్డ్ విమానాలను నడిపినట్లు హీరో మోటో కార్ప్స్ చెబుతున్నది. దీనికి సంబంధించి బోగస్ ఖర్చుల పేరిట రూ.50 కోట్ల మేరకు దారి మళ్లించినట్లు తెలుస్తున్నదని ఐటీ శాఖ అభియోగం. ఒక కీలక వ్యక్తి స్థాపించిన బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్బీఎఫ్సీ) ద్వారా తీసుకున్న అనుమానాస్పద రుణాలు, నిధుల రొటేషన్, డొల్ల కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు, బోగస్ వడ్డీ చెల్లింపుల వివరాలు వెలికి తీయాల్సి ఉందని పేర్కొంది. దీనిపై విచారణ కొనసాగుతుందని ఐటీ శాఖ వివరించింది.
1961 ఆదాయం పన్ను చట్టంలోని వివిధ నిబంధనలు, సెక్షన్ల కింద అనుమతించని వ్యాపారేతర లావాదేవీలు జరిపినట్లు సదరు టూ వీలర్స్ సంస్థ చెబుతున్నది. తదుపరి విచారణ కొనసాగుతుందని ప్రకటించిన ఐటీ శాఖ.. ఆయా కంపెనీల పేర్లు బయట పెట్టలేదు. డొల్ల కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు, తదితర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థల్లో హీరో మోటో కార్ప్స్ ఒకటి అని ఐటీ శాఖ వివరించింది.
ఇదిలా ఉంటే, తాము ఎటువంటి తప్పిదానికి, చట్టాల ఉల్లంఘనకు పాల్పడలేదని హీరో మోటో కార్ప్స్ బుధవారం ప్రకటించింది. ఐటీ శాఖ దర్యాప్తునకు అన్ని విధాల సహకరిస్తున్నామని తెలిపింది. అవసరమైన పత్రాలు, డేటాను అదికారులకు అందజేశామని వివరణ ఇచ్చింది. తమ సంస్థలో సోదాలపై ఐటీ శాఖ నివేదిక.. తమకు ఇచ్చిన సమాచారాన్ని ఎక్స్చేంజ్ ఫైలింగ్లో బయటపెడతామని తెలిపింది. తమ సంస్థ చట్టానికి లోబడి పని చేస్తున్న కార్పొరేట్ సంస్థ అని హీరో మోటో కార్ప్స్ పేర్కొంది.