Hero Moto Corp | కార్ల తయారీ సంస్థల బాటలో దేశంలోనే అతిపెద్ద టూ వీలర్స్ తయారీ సంస్థ హీరో మోటో కార్ప్స్ సంచలన నిర్ణయం తీసుకున్నది. వచ్చే నెల నాలుగో తేదీ నుంచి అన్ని రకాల టూ వీలర్ వెహికల్స్ ధరలు రూ.2000 పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది. పెరిగిన ఇన్పుట్ కాస్ట్ భారంలో కొంత వినియోగదారులపై మోపేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. అన్ని షోరూమ్ల్లో ఆయా మోడల్ బైక్స్, స్కూటీల ధరలు మార్చనున్నట్లు తెలిపింది. ముడిసరకు ధరలు పెరగడం వల్లే ధరలు పెంచుతున్నామని, మోడళ్లను బట్టి పెంపు వర్తిస్తుందన్నది.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోక్స్వ్యాగన్ కూడా జనవరి ఒకటో తేదీ నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆయా మోడల్స్ను బట్టి 2-5 శాతం ధరలు పెరుగుతాయని ఏర్కొంది. కానీ ఇటీవల విడుదల చేసిన టైగన్ మోడల్ కారుకు ఈ పెంపు వర్తించదని పేర్కొంది. ముడిసరుకుతోపాటు ఆపరేషనల్ ఖర్చులు పెరిగినందునే వెహికల్స్ ధరలు పెంచాల్సి వస్తున్నదని కంపెనీ ఇండియా డైరెక్టర్ ఆశిష్ గుప్తా తెలిపారు.
మరోవైపు ఇతర కార్ల తయారీ కంపెనీలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, టయోటా కిర్లోస్కర్ మోటార్, హోండా కార్స్, స్కోడా కూడా ధరలు పెంచనున్నట్లు సంకేతాలిచ్చాయి.