‘ఈ సినిమాను నేను ఎన్ను కున్నా అనే కంటే కథే నన్ను ఎంచుకున్నదనేది వాస్తవం. మంచి సినిమా చేశాననే సంతృప్తిని మిగిల్చింది’ అని అన్నారు కార్తికేయ. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. కౌశిక్ పెగళ్లపాటి దర్శకుడు. జీఏ2 పతాకంపై బన్నీవాస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘కదిలే కాలాన్నడిగా’ అనే గీతాన్ని మంగళవారం చిత్రబృందం విడుదలచేసింది. జేక్స్ బిజోయ్ సంగీతాన్ని అందించిన ఈ గీతాన్ని గౌతమ్ భరద్వాజ్, సాషా త్రిపాఠి ఆలపించారు. కౌశిక్ పెగల్లపాటి, సనారే సాహిత్యాన్ని సమకూర్చారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు మాట్లాడుతూ ‘హీరో దృక్కోణం నుంచి సాగే కథ ఇది. చావు పుట్టుకల ఆంతర్యాన్ని చర్చిస్తూ మార్చురీ వ్యాన్ డ్రైవర్ ప్రయాణంతో ఆసక్తికరంగా సాగుతుంది. వినోదంతో పాటు చక్కటి ఉద్వేగాలుంటాయి. కార్తికేయ పాత్ర సహజంగా సాగుతుంది. లావణ్య త్రిపాఠి నర్స్గా కనిపిస్తుంది’ అని తెలిపారు. తన మనసును ఆకట్టుకున్న కథ ఇదని, బాలరాజు, మల్లిక ప్రేమాయణంతో ప్రతి ఒక్కరూ సహానుభూతి చెందుతారని లావణ్య త్రిపాఠి చెప్పింది. ‘కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేయాలనే ప్రయత్నంలో ఉండగా కౌశిక్ ఈ కథ వినిపించారు. చాలా నచ్చింది. కొత్త పాయింట్తో హృద్యంగా ఉంటుంది’ అని బన్నీవాస్ పేర్కొన్నారు. కార్తికేయ మాట్లాడుతూ ‘ఇప్పటివరకు నేను చేసిన చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ‘ఆర్ఎక్స్ 100’ తర్వాత ఈ సినిమా గురించి అందరూ పాజిటివ్గా మాట్లాడుతుండటం సంతోషాన్ని కలిగిస్తోంది’ అని అన్నారు.