‘బింబిసార’ తనకు పునర్జన్మ లాంటి చిత్రమని అన్నారు హీరో కళ్యాణ్ రామ్. గత వారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో విజయోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దిల్ రాజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ…‘ఈ సినిమా ప్రారంభించిన కొద్ది రోజులకే పాండమిక్ మొదలైంది. మూడున్నర నెలలు లాక్ డౌన్ పెట్టారు. మళ్లీ షూటింగ్ జరిపాక సెకండ్ వేవ్ వచ్చింది.
ఈ పరిస్థితుల్లో చాలా అసహనానికి గురయ్యాము. సినిమా విడుదల చేశాక కూడా ఎలా రిసీవ్ చేసుకుంటారో అని అనుకున్నాం. కానీ మా నమ్మకాన్ని ఈ సినిమా నిలబెట్టింది. ఈ విజయం నాకు పునర్జన్మ లాంటిది. మీరు అందించిన విజయాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇకపై మరిన్ని మంచి చిత్రాల్లో నటిస్తాను. నేను ఇకపై నటించే ప్రతి సినిమా కొత్తగా ఉండేలా చూసుకుంటాను’ అని చెప్పారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ…‘ఒక సినిమా అనుకున్నట్లు రావాలంటే నిర్మాత, హీరో, దర్శకుడు ఈ ముగ్గురే ప్రధాన కారణం. వీళ్లు సమన్వయంతో ఉంటే ఖచ్చితంగా మంచి చిత్రం బయటకొస్తుందని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. ఈ చిత్రాన్ని చూసి మేమంతా నేర్చుకోవాలి. మూడు నాలుగు రోజుల్లోనే బయ్యర్లకు లాభాలు రావడం సంతోషకరం. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి.
ఇండస్ట్రీలో మళ్లీ కాన్ఫిడెన్స్ తెచ్చింది. రిలీజ్కు 15 రోజుల ముందే సినిమా చూశాను. కళ్యాణ్ రామ్ ఎంత బాగా నటించాడు అనిపించింది. నా మాట మీద డిస్ట్రిబ్యూటర్స్ రిలీజ్ చేశారు. నా అంచనా నిజం కావడం ఆనందంగా ఉంది. సినిమా కోసం టీమ్ పడిన కష్టానికి ఫలితం దక్కింది’ అని చెప్పారు. దర్శకుడు వశిష్ఠ మాట్లాడుతూ…‘సినిమా చాలా బాగుందంటూ ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. సంతోషంలో మాటలు రావడం లేదు. విజయాన్నిచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’ అన్నారు.