హైదరాబాద్ : అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మైనారిటీ గురుకుల విద్యా సంస్థల సోసైటీ 7వ పాలక మండలి సమావేశం శుక్రవారం నగరంలోని బంజారాహిల్స్లో గల సొసైటీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి ఛైర్మన్ హోదాలో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, మైనారిటీ సంక్షేమశాఖల మంత్రి కొప్పులఈశ్వర్ అధ్యక్షత వహించారు. పాలక మండలి సభ్యుడి హోదాలో హోంమంత్రి మహమూద్ అలీ, మైనారిటీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఎ.కె.ఖాన్, మైనారిటీశాఖ కార్యదర్శి నదీమ్ అహ్మద్,ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి షానవాజ్ ఖాసీం, మైనారిటీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి షఫీవుల్లా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కొప్పులఈశ్వర్ మాట్లాడుతూ.. రాష్ట్ర గురుకులాలు వినూత్న పద్ధతిలో కొనసాగుతూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. మంచి ఫలితాలు సాధిస్తూ ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్నాయన్నారు. దీంతో సీట్లకు డిమాండ్ బాగా పెరిగిందన్నారు. సమావేశం సందర్భంగా మైనారిటీ గురుకులాలకు చెందిన 121 పాఠశాలలను కళాశాలలుగా సీఎం ఆమోదం తీసుకుని అప్ గ్రేడ్ చేయాలని పాలక మండలి తీర్మానించింది. జాతీయ పోటీ పరీక్షల్లో విద్యార్థినీ విద్యార్థులు తమ ప్రతిభాపాటవాలు చాటే విధంగా 10 పాఠశాలలను సెంటర్ ఫర్ ఎక్స్లెన్స్గా తీర్చిదిద్దేందుకు మండలి ఆమోదం తెలిపింది. వీటిలో ఐదు స్కూల్స్ బాలురు, మరో ఐదు స్కూల్స్ బాలికలకు చెందినవిగా తెలిపారు. ఆదిలాబాద్, జహీరాబాద్, నిర్మల్, నిజామాబాద్లలో కొత్తగా కట్టిన పాఠశాలల భవనాలను తొందరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.
హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. మైనారిటీలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్లు విద్యావంతులై జీవితంలో ఉన్నతంగా ఎదగాలనే సదాశయంతో సీఎం కేసీఆర్ గురుకుల విద్యా సంస్థలను ప్రారంభించి, వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారన్నారు. ఈ గురుకులాలలో ఇంగ్లీష్ మీడియంలో ఉచిత విద్యతో పాటు పోషకాహారాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. విదేశాలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసించేందుకు గాను ఒక్కొక్కరికి రూ. 20 లక్షల రూపాయల చొప్పున ఉచితంగా అందజేస్తున్నట్లు వెల్లడించారు. గురుకుల విద్యా సంస్థలను తెలంగాణ ప్రజలు గర్వించేలా గొప్పగా తీర్చిదిద్దుతున్న షఫీవుల్లా, ప్రవీణ్ కుమార్ లను మంత్రులు ఈ సందర్భంగా అభినందించారు. అదేవిధంగా జాతీయ స్థాయి క్రీడల్లో పతకాలు సాధించిన మైనారిటీ గురుకులాలకు చెందిన 10 మంది విద్యార్థులను మంత్రి కొప్పుల ఈశ్వర్ సత్కరించి, శుభాభినందనలు తెలియజేశారు.