శేరిలింగంపల్లి, డిసెంబర్ 7 : అతివేగంగా దూసుకువచ్చిన టిప్పర్ ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ప్రాణం తీసింది. ఈ సంఘటన గచ్చిబౌలి పోలీస్స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లి కోకాపేట ఔటర్ సర్వీస్ రోడ్డులో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గుంటూరు జిల్లా, ఆకులవారితోట గ్రామానికి చెందిన ఆకాసపు శ్రీనివాస్(28) బేగంపేట్లోని వీ కోలాబ్ సాఫ్ట్వేర్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా విధులు నిర్వహిస్తూ.. సనత్నగర్ బీ-3 ప్లాట్లో నివాసముంటున్నాడు. కాగా మంగళవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో బేగంపేట్లోని కార్యాలయంలో విధులు ముగించుకున్నాడు. తన పల్సర్ ద్విచక్రవాహనంపై శంకర్పల్లి, మొఖిల గ్రామానికి చెందిన స్నేహితుడు గుర్రాల ఉదయ్ భాస్కర్ ఇంటికి బయలుదేరాడు. మార్గమధ్యలోని వట్టినాగులపల్లి కోకాపేట్ ఔటర్ సర్వీస్రోడ్డు వద్దకు చేరుకోగానే.. మితిమీరిన వేగంతో దూసుకువచ్చిన టిప్పర్ లారీ(టీఎస్30 టీ 0590) శ్రీనివాస్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంపై నుంచి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. హెల్మెట్ ఊడిపోవడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, చలాన్ భయానికి కొందరు హెల్మెట్ పెట్టుకుంటే.. రక్షణగా ఉంటుందని కొందరు వాహనదారులు తలకు హెల్మెట్ ధరిస్తారు. కాని హెల్మెట్ ధరిస్తున్న కొందరు చిన్నపాటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. హెల్మెట్ బెల్టు లాక్ పెట్టుకోక పోవడంతో ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ తలనుంచి ఊడిపోతుంది. ఇలాంటి సమయంలో హెల్మెట్ ధరించినా ఫలితం ఉండదు. ఇందుకు సాఫ్ట్వేర్ ఇంజినీరు శ్రీనివాస్ మరణమే కారణంగా చెప్పవచ్చు. శ్రీనివాస్ హెల్మెట్ ధరించినప్పటికీ.. బెల్టు లాక్ వేసుకోలేదు. ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్ తలనుంచి ఎగిరిపోయింది. దీంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్మెట్ బెల్టులాక్ పెట్టుకుంటే బతికి ఉండేవాడని స్థానికులు పేర్కొన్నారు.