హైదరాబాద్: ద్రోణి ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉన్నది. దీని ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర- దక్షిణ ద్రోణి దక్షిణ ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ, రాయలసీమ, తమిళనాడు మీదుగా కొమరం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద స్థిరంగా కొనసాగుతున్నదని పేర్కొన్నది. ఉపరితల ఆవర్తనం ఏపీలోని కోస్తా తీరం పశ్చిమ మధ్య పరిసర ప్రాంతాల్లో ఉన్న నైరుతి బంగాళాఖాతంలో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతున్నదని తెలిపింది.
దీనివల్ల ఈ నెల 6వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వివరించింది. ఈ మేరకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.