అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కర్నూలు జిల్లా దేవరకొండ మండలం తేర్నెకల్, కుంకునూర్ గ్రామాల్లో వర్షపు నీరు ఇళ్లల్లోకి చేరడంతో గ్రామస్థులు ఇబ్బందులకు గురయ్యారు. తెర్నేకలో రహదారులు కాలువల్ల మారాయి. కడప జిల్లాలో పాపాగ్ని నది ఉద్ధృతంగా పొంగిపొర్లుతుంది .
ఆదోని పట్టణంలోని పలు కాలనీలోకి వాన నీరు చేరింది. అనేక గ్రామాలు జలదిగ్ధబంధంలో చిక్కుకున్నాయి. పంటపొలాలు నీట మునిగాయి. అనంతపురం జిల్లాలో రెండురోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. అన్నమయ్య జిల్లా వెలిగల్లు జలాశయం నుంచి మూడు గేట్లు ఎత్తి 3 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఈ జనార్దన్ గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.