హైదరాబాద్, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజులు ఇదే పరిస్థితి కొనసాగన్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీనికి అనుబంధంగా రాజస్థాన్లోని జైసల్మేర్ నుంచి ఉత్తర అండమాన్ సముద్రం వరకు ద్రోణి కొనసాగుతున్నట్టు వెల్లడించింది. వీటి ప్రభావంతో తెలంగాణలో రెండు రోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హెచ్చరించింది.
ఈ మేరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, హైదరాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, మేడ్చల్, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చే సింది. ఏపీలో విశాఖ, కర్నూలు, ప్రకాశం, నం ద్యాల జిల్లాల్లో వర్షాలు అధికంగా ఉంటాయని తెలిపింది. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, కాకినాడ, కోనసీమ, బాపట్ల, విజయవాడ, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవవచ్చని పేర్కొన్నది.
నమస్తే నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 28 జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రోడ్లు కొట్టుకుపోవడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాల వల్ల గోదావరిలో నీటిమట్టం మళ్లీ పెరుగుతున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద సోమవారం ఉదయానికి 1.65 లక్షల క్యూసెక్కులుగా ఉన్న ప్రవా హం.. సాయంత్రానికి 5.20 లక్షల క్యూసెక్కులకు చేరింది.
భద్రాచలం వద్ద నీటిమట్టం 36.5 అడుగులకు పెరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మం డలం బేతుపల్లి చెరువులో నీటిమట్టం 16 అడుగుల గరిష్ఠస్థాయికి చేరింది. పాలే రు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా.. సోమవారం సాయంత్రానికి 24.75 అడుగులకు చేరింది. కాగా వర్షాలకు గోడలు తడవడంతో నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, ములుగు జిల్లా మంగపేట మండలంలోని కొత్తమల్లూరు (బెస్తగూడెంలో)లో ఇండ్లు కూలడంతో ఇద్దరు మరణించారు.