జకర్తా : తూర్పు ఇండోనేషియాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాలు ధాటికి కొండచరియలు విరిగిపడటం, వరదల కారణంగా 44 మంది మృతి చెందారు. వేల మంది నిరాశ్రయులుకాగా చాలామంది గల్లంతయ్యారని విపత్తు ఉపశమన సంస్థ తెలిపింది.
నుసా తెంగ్గరా ప్రావిన్స్లోని ఫ్లోరెస్ ద్వీపంలో అర్థరాత్రి కురిసిన భారీ వర్షాలకు లామెనెలే గ్రామంలోని ఇండ్లను చుట్టుపక్కల కొండపైనుంచి వచ్చిన బురద ముంచెత్తింది.
దీంతో 38 మంది ప్రాణాలు కోల్పోగా.. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశాయి.
రాత్రి మొత్తం ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి నది తీరం సమీపంలోని వైబురక్ గ్రామాన్ని వరద ముంచెత్తడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా ఏడుగురు గల్లంతయ్యారు.
గాయపడిన నలుగురికి స్థానికంగా చికిత్స అందిస్తున్నట్లు విపత్తు నిర్వహణ స్థానిక అధికారి ఓలా తెలిపారు. వందలాది ప్రజలు సహాయక చర్యల్లో పాల్పంచుకుంటున్నారు.
రహదారులు కొట్టుకుపోవడం, విద్యుత్ అంతరాయం, వరద ఉధృతి తగ్గని కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతుందని జాతీయ విపత్తు ఉపశమన సంస్థ అధికార ప్రతినిధి రాధిత్యజాటి తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణ, ఆస్తి నష్టంపై అధికారులు పూర్తిస్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి