హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో సోమవారం సాయంత్రం కుండపోత వాన కురిసింది. మూడు రోజులుపాటు గ్యాప్ ఇచ్చిన వరుణుడు, సాయంత్రం ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. మధ్యాహ్నం దాకా ఎండ దంచి కొట్టగా, సాయంత్రం ఐదింటి వరకు వాతావరణం మారింది. ఆకాశంలో కారు మబ్బులు కమ్మాయి. సాయంత్రం 6 గంటలకు చిరుజల్లులతో మొదలైన వర్షం.. ఒక్కసారిగా కుంభవృష్టికి చేరుకున్నది. ఉద్యోగులు, కార్మికులు ఆఫీసుల నుంచి ఇండ్లకు వెళ్లే సమయం కావడంతో హైదరాబాద్ నగర రోడ్లపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
బల్దియా, ట్రాఫిక్ పోలీసులు వెంటనే రంగంలోకి పలు లోతట్టు ప్రాంతాల్లో ట్రాఫిక్ క్లియర్ చేశారు. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు నగరంలోని గోషామహల్ సర్కిల్లో అత్యధికంగా 9.2 సెంటీమీటర్ల వాన కురిసింది. గన్ఫౌండ్రీ 8.6, మెహదీపట్నం 8.3, ఖైరతాబాద్ 7.5, సరూర్నగర్ 7.2, రాజేంద్రనగర్ 6.4, హిమాయత్నగర్ 6.3, ఆసిఫ్నగర్ 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎర్రగడ్డ, మూసాపేట్, ఫతేనగర్, బల్కంపేట్లోనూ పడిన వర్షంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
మూడురోజులు మోస్తరు వర్షాలు
రాష్ట్రంలో రాగల మూడురోజులపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు డాక్టర్ నాగరత్న సోమవారం తెలిపారు. ఆదివారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంతోపాటు దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ప్రస్తుతం సగటు సముద్రమట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించిందని చెప్పారు. ఉత్తర, వాయవ్య దిశల నుంచి తెలంగాణ వైపు గాలులు బలంగా వీస్తున్నాయని వెల్లడించారు. మంగళ, బుధ, గురువారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు పడతాయని వివరించారు. హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు.