హైదరాబాద్ : పంజాగుట్ట నిమ్స్ దవాఖానలో గుండెమార్పిడి శస్త్ర చికిత్స విజయవంతమైంది. దాదాపు ఐదుగంటల పాటు శ్రమించి వైద్యులు చికిత్స పూర్తి చేశారు. ప్రస్తుతం పెయింటర్ ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు ప్రకటించారు. ఐసీయూకు తరలించి, చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. గుండెమార్పిడి శస్త్ర చికిత్స కోసం మలక్పేట యశోద ఆసుపత్రి నుంచి గుండెను తరలించారు.
ఇందుకు బుధవారం మధ్యాహ్నం గ్రీన్ ఛానెల్ను ఏర్పాటు చేసి.. ప్రత్యేక అంబులెన్స్లో గుండెను తీసుకువచ్చారు. బ్రెయిన్ డెడ్ అయిన కానిస్టేబుల్ వీరబాబు నుంచి గుండెను సేకరించారు. ఈ నెల 12వ తేదీన గొల్లగూడెం వద్ద వీరబాబు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్ అదుపుతప్పి వీరబాబు కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఖమ్మం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ వీరబాబు బ్రెయిన్ డెడ్కు గురైనట్లు నిన్న యశోద వైద్యులు ప్రకటించారు.
వీరబాబు కొండాపూర్ స్పెషల్ బ్రాంచ్లో కానిస్టేబుల్గా పని చేశాడు. ఆయన గుండెదానానికి కుటుంబీకులు ముందుకొచ్చారు. గుండె కోసం జీవన్దాన్లో 30 ఏండ్ల వయసున్న ఓ పెయింటర్ నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇవాళ వైద్యులు కానిస్టేబుల్ వీరబాబు గుండెను సేకరించి.. పెయింటర్కు శస్త్ర చికిత్స చేసి అమర్చారు. గతంలోనూ నిమ్స్లో వైద్యులు గుండెమార్పిడి శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించారు.