న్యూఢిల్లీ : ప్రపంచంలో ఏడువేల అరుదైన వ్యాధులు ఉన్నాయి. కానీ, అన్నింటికీ చికిత్స అందుబాటులో లేదు. ప్రస్తుతం వీటిలో ఐదుశాతం వాటికి మాత్రమే చికిత్స అందుబాటులో ఉందని కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ అన్నారు. కరోనా మాదిరిగానే అరుదైన వ్యాధుల జన్యుశ్రేణి గుర్తింపు ప్రక్రియ కూడా జరుగుతుందని తెలిపారు. అరుదైన వ్యాధులపై పోరాటానికి కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. క్రౌడ్ ఫండింగ్, టీబీ ఫ్రీ వర్క్ప్లేసెస్పై జరిగిన వెబ్నార్లో ప్రసంగించారు. ప్రపంచవ్యాప్తంగా 8శాతం మంది వివిధ రకాల అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని కేంద్రమంత్రి తెలిపారు.
అలాంటి రోగులకు సహాయం చేసేందుకు అన్ని కార్పొరేట్ గ్రూప్ల నుంచి ఆర్థిక సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ అరుదైన వ్యాధుల విధానాన్ని ప్రస్తావిస్తూ .. క్రౌడ్ ఫండింగ్ కోసం జాతీయ డిజిటల్ పోర్టల్ రూపొందించినట్లు చెప్పారు. అరుదైన వ్యాధుల ఆందోళనను దృష్టిలో ఉంచుకుని, కరోనా కాలంలో నేషనల్ రేర్ డిసీజ్ పాలసీని రూపొందించినట్లు చెప్పారు. మశూచి, పోలియోను నిర్మూలించినట్లే అరుదైన వ్యాధులపై యుద్ధం చేయాల్సి ఉందన్నారు.
దేశంలో ఎనిమిది సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు (సీఓఈ) కేంద్రాలను, మరో ఐదు డయాగ్నొస్టిక్ కేంద్రాలు సైతం చేశారన్నారు. బయోటెక్నాలజీ విభాగం న్యూ ఢిల్లీలోని లేడి హార్డింగ్ మెడికల్ కాలేజీలో మొదటి రోగ నిర్ధారణ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని, ఇప్పుడు జిల్లాల్లో మరిన్ని రోగ నిర్ధారణ కేంద్రాలు నెలకొల్పనున్నట్లు పేర్కొన్నారు. భారత్లో టీబీ కేసుల్లో 33శాతం, మరణాల సంఖ్య 37శాతం తగ్గిందన్నారు. కొవిడ్ కాలంలోనూ టీబీ నివారణపై దృష్టి సారించినట్లు కేంద్రమంత్రి తెలిపారు.