హైదరాబాద్,జూలై :ఎండుద్రాక్ష తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎండుద్రాక్షను కిస్మిస్ అని కూడా అంటారు. ఎండుద్రాక్ష తినడం వల్ల వాత ,పిత్త , కఫము వంటి త్రిదోషాలు హరిస్తాయి. వీర్యవృద్ధి తోపాటు రక్తవృద్ధి చేస్తుంది. శరీరానికి, గుండెకు బలాన్నిస్తుంది. కంఠాన్ని శుభ్రపరిచి, దగ్గు తగ్గిస్తుంది. సాఫీగా విరేచనమయ్యేలా చేస్తుంది. క్షయవాధి నివారణకు ఇది ఉపకరిస్తుంది.
చరకుని అభిప్రాయంలో ఎండిన ద్రాక్ష అమృతతుల్యమయినది. ఇతర ఆహార పదార్థాలు అన్నీ మానేసి, కేవలం ఎండిన ద్రాక్ష ఆహారంగా రెండు మాసాలు తీసుకుంటే, ఎటువంటి దీర్ఘవ్యాధులయినా తగ్గుతాయని చరక సంహితలో పేర్కొన్నారు. నీరసానికిది మంచి టానిక్ లా పనిచేస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంపొందిస్తుంది. ఏ వ్యాధి గురించి ఔషధాలు వాడుతున్నా, కిస్మిస్ తీసుకుంటే, ఆ ఔషధాల పనితీరును మెరుగుపరిచి శరీరానికి మేలు చేస్తుంది.
గుప్పెడు కిస్మిస్ ను శుభ్రంగా కడిగి, ఒక గ్లాసు నీటిలో లేక పాలలో లేదా పెరుగులో వేసి రాత్రంతా నానబెట్టి, ఉదయం వాటిని బాగా మెత్తగానలిపి తీసుకుంటే ఏ సంతులిత ఆహారానికీ తీసిపోని పౌష్టికత దీనిలో దొరుకుతుంది. అంతేకాదు ఇలా చేయడం వల్ల చర్మవ్యాధులు దరిచేరవు. కిస్మిస్ లో ఐరన్,కాల్షియం అధికంగా వున్నాయి. అందువలన ఇది రక్తవృద్ధి చేస్తుంది. ఎముకలకు దృఢత్వాన్ని కల్గిస్తుంది. స్త్రీలకు మధ్య వయసులో వచ్చే ఎముకల వ్యాధుల నివారణకు ఇది అద్భుతంగా పనిచేస్తుoది. శరీరంలో సహజంగా రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. అజీర్ణం, మలబద్దకం వంటి సమస్యల పరిష్కారానికి కిస్మిస్ కి మించింది లేదు.