(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): హిమాచల్ప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రంలో రాజకీయ వేడి పెరిగింది. రెండోసారి అధికారంలోకి వచ్చి చరిత్ర తిరగరాయాలని బీజేపీ తహతహలాడుతుండగా.. కాషాయపార్టీని గద్దె దించి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నది. పంజాబ్ విజయంతో జోరు మీదున్న ఆమ్ఆద్మీపార్టీ ఇక్కడ కూడా సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతున్నది. దీంతో హిమాచల్లో ముక్కోణపు పోటీ కనిపిస్తున్నది.
హిమాచల్లో 1985 నుంచి ఏ పార్టీ కూడా వరుసగా రెండోసారి అధికారంలోకి రాలేదు. అయితే ఈసారి తిరిగి అధికారం నిలబెట్టుకోవాలని బీజేపీ నేతలు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీ పాలనపై అన్ని వర్గాల వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. దీంతో ప్రజలకు తాయిలాలు ప్రకటించి గట్టెక్కాలని జైరాం ఠాకూర్ సర్కారు భావిస్తున్నది. పేదలకు 125 యూనిట్ల విద్యుత్తు ఫ్రీగా ఇస్తామని, మహిళలందరికీ బస్సుల్లో 50 శాతం టికెట్ రాయితీ కల్పిస్తామని ఠాకూర్ ప్రకటించారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లు ఫ్రీగా ఇస్తామని, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీరు పన్ను రద్దు చేస్తామని ప్రకటించారు. ఉచితాలకు వ్యతిరేకమంటూ ప్రచారం చేసుకునే బీజేపీ ఇక్కడ మాత్రం ఉచితాలు ప్రకటించడం గమనార్హం.
అధికార బీజేపీ కంటే ఎన్నికలను ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ముందుంది. స్టార్ క్యాంపెయినర్గా ప్రియాంకాగాంధీ రంగంలోకి దిగారు. బీజేపీ అభ్యర్థులను వెతుక్కుంటుంటే… కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్టులోనే 45 అభ్యర్థులను ప్రకటించింది. గత ఎన్నికల్లో గెలిచిన 22 మంది ఎమ్మెల్యేల్లో 21మందికి తిరిగి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలసివస్తుందని భావిస్తున్నది. తమను గెలిపిస్తే ఉద్యోగుల పాత పెన్షన్ విధానాన్ని పునరుధ్ధరిస్తానని హామీ ఇచ్చి ఉద్యోగులను ఆకర్షించాలని చూస్తున్నది. మహిళలకు ప్రతినెలా రూ.1500 పెన్షన్ అందిస్తామని చెబుతున్నది. 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని, స్టార్టప్ల కోసం రూ.680 కోట్ల ఫండ్ ఏర్పాటు చేస్తామని యువకుల మద్దతు కూడకట్టడానికి ప్రయత్నిస్తున్నది.
ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో.. అత్యధిక సీట్లలో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ముఖాముఖి పోటీ ఉండేది. కానీ ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కూడా రంగంలో ఉండటంతో ఎన్నికలు చాలా చోట్ల ముక్కోణపు పోటీగా మారబోతున్నాయి. ఆప్ ఇప్పటికే 58 నియోజకవర్గాల్లో తమ అభ్యర్ధులను ప్రకటించింది. అధికార పార్టీపై ఉండే వ్యతిరేక ఓటు వల్ల తమ గెలుపు నల్లేరుమీద నడకే అని కాంగ్రెస్ నాయకులు అంటున్నా, బీజేపీ మాత్రం ఈసారి రంగంలో ఆప్ అభ్యర్థులు కూడా పోటీ చేస్తే, ముక్కోణపు పోటీగా మారుతుందని, దాంతో తమకే అధికార పీఠం దక్కుతుందని ఆశాభావంతో ఉన్నది.