భైంసాటౌన్ : వృద్ధాప్యంలో తోడు కోసం ఒకరు.. భర్తను కోల్పోయి పాప కోసం ఇంకొకరు వివాహం చేసుకుని ఆదర్శంగా నిలిచారు. వీరి మధ్య వయస్సు భారీగా తేడా ఉన్నప్పటికీ కలిసి జీవనం సాగించటానికి ముందుకు వచ్చి ఒక్కటయ్యారు ముథోల్ మండలం చింతకుంట తండాకు చెందిన రాథోడ్ కిషన్, కుభీర్ మండలం రంజని తండాకు చెందిన సునీత. వీరు గురువారం భైంసా మండలంలోని దేగాం గ్రామం సాయిబాబా ఆలయంలో కుటుంబీకుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. రాథోడ్ కిషన్ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఆయన వయస్సు (73) సంవత్సరాలు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ముగ్గురికి కూడా పెళ్లిళ్లు చేశాడు.
కొన్ని సంవత్సరాల క్రితం భార్య అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన బాగోగులు చూసుకునేవారు ఎవరూ లేకుండా పోయారు. సునీత వయస్సు (26) సంవత్సరాలు. ఈమె భర్త గత ఐదు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. ఈమెకు ఒక పాప ఉంది. భర్త చనిపోయినప్పటి నుంచి కూలీ పనులు చేస్తూ పాపను పోషించుకుంటుంది. తమ సమీప బంధువుల ఇంట్లో జరిగిన కార్యక్రమంలో కిషన్, సునీత ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఇద్దరికి తోడు లేకపోవడంతో పెళ్లిచేసుకోవాలనుకున్నారు. తమ పెళ్లి ప్రస్తావనను రెండు కుటుంబాలతో చర్చించి వారి నుంచి కూడా సానుకూలత రావడంతో బుధవారం ఆలయంలో పెళ్లి చేసుకున్నారు.