న్యూఢిల్లీ, ఏప్రిల్ 4: దేశీ కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద విలీనానికి తెరలేచింది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్, భారీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కలసిపోతున్నాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్లోకి దాని మాతృసంస్థ అయిన హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ( హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ )విలీనం కానుంది. విలీనంతో బ్యాంక్లో 41 శాతం వాటా హెచ్డీఎఫ్సీ షేర్హోల్డర్ల స్వంతమవుతుం ది. అలాగే ఇకముందు విలీన కంపెనీ పూర్తిగా 100 శాతం పబ్లిక్ షేర్హోల్డర్లకు చెందుతుంది. సోమవారం ఇరు సంస్థలూ స్టాక్ ఎక్సేంజీలకు ఈ మేరకు సమాచారం అందించాయి. ప్రతిపాదిత విలీన నిష్పత్తి ప్రకారం ప్రతీ హెచ్డీఎఫ్సీ షేర్హోల్డర్లకు వారి వద్దనున్న 25 షేర్లకుగాను 42 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లు వస్తాయి. రిజర్వ్బ్యాంక్, ఇతర అవసరమైన నియంత్రణాపరమైన అనుమతులకు లోబడి ఈ విలీనం జరుగుతుంది. వచ్చే ఏడాది 2 లేదా 3వ త్రైమాసికంలో విలీన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా.
బలాబలాలు
ఒకటి గృహ తనఖా వ్యాపారంలో నంబర్ వన్ అయితే మరోటి ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజంగా ఎదిగింది. వాస్తవానికి 1990 దశకంలో హెచ్డీఎఫ్సీయే ఈ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ను నెలకొల్పింది. కానీ 2000 దాటేసరికి ఆస్తుల విలువలో మాతృసంస్థనే బ్యాంక్ మించిపోయింది. ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ మొత్తం ఆస్తుల విలువ రూ.6.23 లక్షల కోట్లుకాగా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆస్తుల విలువ అంతకు మూడు రెట్లు రూ.19.38 లక్షల కోట్ల మేర ఉన్నాయి. అలాగే బ్యాంక్కు 6.8 కోట్ల విస్త్రత ఖాతాదారుల బేస్ ఉంది. 3,000 నగరాలు, పట్టణాల్లో 6,342 శాఖలున్నాయి. ఇక బ్యాంక్లకు సహజంగా డిపాజిట్లు సేకరించుకునే వెసులుబాటు ఉన్నందున హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నిధుల సేకరణ వ్యయం తక్కువ. కార్పొరేషన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్లు బలాబలాలు కలసిరావడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ విలువ మరింత పెంపొందుతుందని హెచ్డీఎఫ్సీ తెలిపింది. విలీనంతో ఏర్పడే భారీ బ్యాలెన్స్ షీట్, నికర విలువల కారణంగా బ్యాంక్ ప్రయోజనం పొందుతుందన్నది. దీంతో భారీ పరిమాణంగల రుణాలివ్వగలుగుతుందని, భారత ఆర్థిక వ్యవస్థలో రుణ వితరణ మరింతగా జరిగే తోడ్పడుతుందన్నది.
సమానుల సమ్మేళనం: దీపక్ పరేఖ్
ఈ విలీనం సమాన సంస్థలు ఒకటికావడమేనని హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బ్యాంక్లు, నాన్-బ్యాంక్లు (ఎన్బీఎఫ్సీలు) మధ్య నిబంధనల అంతరం తగ్గుతుండటం ఈ విలీన నిర్ణయానికి కీలక అంశమన్నారు. గత మూడు వారాలుగా విలీన చర్చలు జరుగుతున్నాయని, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అయినందున హెచ్డీఎఫ్సీ ప్రస్తుతం ప్రాధాన్యత రంగ రుణాల పరిమితిని పాటించనవసరం లేదని, ఎస్ఎల్ఆర్, సీఆర్ఆర్లకు కేటాయింపులు జరపనక్కర్లేదని, ఈ ఆస్తి, అప్పుల విషయంలో రిజర్వ్బ్యాంక్ కొంత సమయాన్ని మంజూరు చేస్తుందని ఆశిస్తున్నామన్నారు. విలీన ప్రతిపాదనకు రెగ్యులేటర్లు అనుమతి ఇస్తారన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 12-18 నెలల్లో విలీనం జరుగుతుందన్నారు.