హైదరాబాద్,జూలై:హైదరాబాద్ చార్టర్డ్ అకౌంటెంట్స్ సొసైటీ(హెచ్సీఏఎస్) చార్టర్డ్ ఎకౌంటెంట్స్ నైపుణ్యాన్ని పెంచడానికి లెర్నింగ్ ప్లాట్ ఫామ్ ను ప్రారంభించింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) పూర్వ అధ్యక్షులు సీఏ ఎం దేవేందర్ రెడ్డి సీఏల కోసం ఏర్పాటుచేసిన చార్టర్డ్ ఎకౌంటెంట్స్ కోసం లెర్నింగ్ ప్లాట్ ఫామ్ పోర్టల్ ను ప్రారంభించారు. పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా తమ విజ్ఞానం పెంచుకోవడంలో సీఏలకు ఇది సహాయపడనున్నది.
ఈ వేదిక ద్వారా యువ బృందానికి తగిన మద్దతు వ్యవస్థ లభిస్తుందని సీఏ నిపుణులు అభిప్రాయపడ్డారు.నాణ్యతమైన అభ్యాస వేదికను నిర్వహించాలని,చార్టర్డ్ అకౌంటెన్సీ నైపుణ్యాభివృద్ధికి తోడ్పడటంతో పాటు ఇతర అంశాలలో వృత్తిని విస్తరిస్తూ వాణిజ్య,పరిశ్రమ,వ్యాపార రంగాలకు ప్రభావవంతంగా సేవలను అందించేలా తీర్చిదిద్దాలని హెచ్సీఏఎస్ లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ సందర్భంగా హెచ్సీఏఎస్ అధ్యక్షులు సీఏ ప్రబినా కుమార్ మాట్లాడుతూ ‘‘ అవసరమైన శిక్షణ, సహాయం, మార్గనిర్దేశకత్వం అనేవి అత్యంత కీలకాంశాలు కావడంతో పాటుగా జర్నల్స్, ప్రచురణలు,విద్యా కార్యక్రమాలు,విజ్ఞాన పరిష్కారాల పోర్టల్ ద్వారా వాటిని చేరుకోగలం. ఆడిటింగ్,ఫెమా,అంతర్జాతీయ ట్యాక్సేషన్,వాల్యుయేషన్ తదితర అంశాలపై కీలకమైన కమిటీలను ఏర్పాటుచేయడం జరిగింది. ప్రొఫెషనల్స్ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.