భూపాల్: ఆవు పిడకలతో ఇంట్లో హవనం చేస్తే ..ఆ ఇళ్లు దాదాపు 12 గంటల పాటు శానిటైజ్ అయి ఉంటుందని, దాని వల్ల కరోనా లాంటి వ్యాధులు రావు అని మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా థాకూర్ తెలిపారు. భారతీయ వైదిక జీవనశైలిని అలవర్చుకోవాలని ఆమె అన్నారు. వైదిక క్రతువులు, పూజలు చేస్తున్న సమయంలో హవనంలో భాగంగా వస్తువులను అగ్నికి ఆహుతి ఇస్తుంటారు. అలాగే ఇంట్లో ఆవు పిడకలతో హవనం చేస్తే ఆ ఇట్లు 12 గంటల పాటు శానిటైజ్ అవుతుందని మంత్రి తెలిపారు. ఇండోర్ ప్రెస్ క్లబ్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కోవిడ్19 మహమ్మారిని అడ్డుకోవాలంటే.. అలోపతి వైద్యంతో పాటు వైదిక జీవన విధానాన్ని కూడా అలవర్చుకోవాలన్నారు. వైదిక జీవనశైలికి అందరూ వెళ్లాలన్న రీతిలో మహమ్మారి పాఠాలు నేర్పినట్లు మంత్రి థాకూర్ తెలిపారు. ఆవు నెయ్యి కలిపిన బియ్యం మిశ్రమాన్ని ఆవు పేడతో కలిపి హవనం చేయాలని ఆమె సూచించారు. సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో ఇలా చేస్తే ఇళ్లు 12 గంటల పాటు శానిటైజ్ అయి ఉంటుందని మంత్రి తెలిపారు. తాను చేసిన సూచన నమ్మశక్యంగా లేకపోయినా.. ఇదే సైన్స్ అని ఆమె అన్నారు.