చండీగఢ్: నీట మునిగిన రోడ్డులో నిలిచిన స్కూల్ బస్సు నుంచి పొగలు వచ్చాయి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందారు. డ్రైవర్ కేకలు వేయడంతో స్కూల్ బస్సులోని పిల్లలను స్థానికులు రక్షించారు. హర్యానాలోని సిర్సా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఫతేహాబాద్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని రోడ్లు జలమయమయ్యాయి. ధర్మశాల రోడ్డు మోకాలు లోతు నీటిలో మునిగింది. అయితే శనివారం మధ్యాహ్నం ఒక స్కూల్ బస్సు విద్యార్థులను ఇళ్లకు తీసుకెళ్తున్నది. నీట మునిగిన ఆ రోడ్డులో ఆ స్కూల్ బస్సు నిలిచిపోయింది. అనంతరం ఉన్నట్టుండి స్కూల్ బస్సు కింద నుంచి పొగలు వచ్చాయి. దీంతో అందులోని విద్యార్థులు భయాందోళన చెందారు.
మరోవైపు పొగలు చూసి స్కూల్ బస్సు డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. కేకలు వేసి స్థానికులను అలెర్ట్ చేశాడు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్నవారు పరుగున ఆ స్కూల్ బస్సు వద్దకు వచ్చారు. రోడ్డు నీట మునగడంతో అందులోని విద్యార్థులను బస్సు కిటికీల నుంచి బయటకు తీసి రక్షించారు. వారిని ఎత్తుకుని రోడ్డు దాటించారు.
కాగా, నీట మునిగిన ఆ రోడ్డు మీదుగా స్కూల్ బస్సు వెళ్లడంతో నీళ్లు ఇంజిన్లోకి వెళ్లాయి. దీంతో వేడిగా ఉన్న ఇంజిన్ నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చాయి. ఇది చూసి బస్సులోని విద్యార్థులతోపాటు స్థానికులు కంగారు పడ్డారు. హుటాహుటిన స్కూల్ పిల్లలను బస్సు నుంచి బయటకు తీసి కాపాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.