చండీగఢ్ : మైడెన్ ఫార్మాస్యూటికల్స్ దగ్గు సిరప్ల ఉత్పత్తిని నిలిపివేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర, రాష్ట్ర డ్రగ్స్ డిపార్ట్మెంట్ సంయుక్త తనిఖీల్లో సిరప్లో 12 లోపాలు వెలుగులోకి వచ్చాయి. గాంబియాలో 66 మంది చిన్నారుల సిరప్ కారణంగా మృతి చెందారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంయుక్త బృందం తనిఖీలు నిర్వహించారు. ఇందులో వెల్లడైన లోపాలను దృష్టిలో పెట్టుకొని మొత్తం ఉత్పత్తినే నిలిపివేయాలని నిర్ణయించి, ఈ మేరకు నోటీసులు జారీ చేసినట్లు హర్యానా హోంశాఖ మంత్రి అనిల్ విజ్ తెలిపారు.
సోనిపట్కు చెందిన ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న మూడు డ్రగ్స్ నమూనాలను కోల్కతాలోని సెంట్రల్ డ్రగ్ ల్యాబ్కు పంపామని, ఇంకా నివేదికలు అందలేదన్న ఆయన.. ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల రోజుల కిందట హర్యానాలో తయారైన నాలుగు దగ్గు సిరప్ ఉత్పత్తులపై హెచ్చరికలు జారీ చేసింది. గాంబియాలో తీవ్రమైన కిడ్నీ గాయాల కారణంగా 66 మంది మృతి చెందినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. ఇందులో డై ఇథనీల్ గ్లైకాల్, ఇథలీన్ గ్లైకాల్ మందు మోతాదుకు మించి ఉందన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఇది పూర్తిగా విషపూరితమని మూత్రపిండాల వ్యాధికి దారితీస్తుందని హెచ్చరించింది.