చండీఘఢ్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో పలు రాష్ట్రాలు కఠిన నియంత్రణలు అమలు చేస్తున్నాయి. ప్రముఖ నగరాల్లో వీకెండ్ కర్ఫ్యూ, నైట్ కర్ఫ్యూలు విధిస్తుండగా కొవిడ్-19 కట్టడికి హర్యానా ప్రభుత్వం గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 12 వరకూ మరో ఆరు జిల్లాల్లో సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్లను మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
కర్నాల్, పానిపట్, కురుక్షేత్ర, యమునా నగర్, రోహ్తక్, జజ్జర్ జిల్లాల్లో తాజా నియంత్రణలు అమలవుతాయని రాష్ట్ర ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటికే థియేటర్లు, మల్టీప్లెక్స్లు, బ్యూటీ పార్లర్లు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్నాజియంలు మూతపడ్డాయి.
ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 90,928 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడగా మహమ్మారి బారినపడి ఒక్కరోజులోనే 328 మంది ప్రాణాలు కోల్పోయారు. కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్కు కరోనా సోకింది. తనకు నిర్వహించిన కొవిడ్-19 పరీక్షలో పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందని ఆమె ట్వీట్ చేశారు.