బొంరాస్పేట, ఆగస్టు:తెలంగాణ రాష్ట్రంలో అటవీ సంపదను పెంచడానికి ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుంది. రహదారులకు ఇరువైపులా రెండు మూడేండ్ల కిందట నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి కొత్త అందాలను తెచ్చి పెడుతున్నాయి. ఒకప్పుడు రోడ్ల వెంబడి చెట్లు లేక బోసిపోయినట్లు కనబడే రహదారులు నేడు పచ్చని చెట్లతో కళకళలాడుతూ ఆహ్లాదాన్ని ఇస్తున్నాయి. మండలంలోని తుంకిమెట్ల-కోస్గి రహదారికి ఇరువైపులా అటవీ శాఖ అధికారులు మూడేళ్ల కిందట సుమారు 1500 మొక్కలు నాటారు.
నాటిన మొక్కలకు రక్షణగా కంచెను ఏర్పాటు చేసి నీళ్లు పోసి కాపాడారు. ఫలితంగా ఆ మొక్కలే నేడు చెట్లుగా మారాయి. రహదారిపై వెళ్తుంటే ప్రయాణీకులకు చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. వేసవిలో ప్రయాణీకులకు నీడనిచ్చి ఎంతో ఉపయోగపడుతాయని ప్రజలు భావిస్తున్నారు. మండలంలోని ముచ్చుకుంటలో రహదారికి ఇరువైపులా హరితహారంలో ఏడాది కిందట నాటిన మొక్కలు ఏపుగా పెరిగి రోడ్డుకు కొత్త అందాన్ని తెచ్చిపెట్టాయి. తండా ప్రజల చొరవతో హరితహారంలో నాటిన మొక్కలు పెరిగి ఫలితాలిస్తున్నాయి.