మహబూబ్నగర్ : జిల్లాలో హరితహారం కార్యక్రమం కొనసాగుతున్నది. మొక్కలు లేని కొండలు, గుట్టల్లో పెద్ద ఎత్తున విత్తనబంతులు చల్లి పచ్చదనం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నది. ఇప్పటికే 2.08కోట్ల విత్తన బంతులు సిద్ధం చేసిన అధికారులు.. వాటిని చల్లే పనులను కొనసాగిస్తున్నారు. శనివారం జిల్లావ్యాప్తంగా 1,79,84,704 సీడ్బాల్స్ వెదజల్లినట్లు అధికారులు పేర్కొన్నారు. మహిళా సంఘాల సభ్యులు తయారు చేసిన 2.8కోట్ల విత్తనబంతులు వెదజల్లేందుకు హరితయాత్రలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా గత రెండు రోజులుగా మహిళా హరిత యాత్ర, విద్యార్థులు, యువజన సంఘాల హరిత యాత్ర చేపట్టారు. శనివారం జిల్లా అధికారులతో సహా అన్ని మండలాలు, గ్రామ పంచాయతీల్లోని ఉద్యోగులందరు ఉద్యోగ హరిత యాత్ర నిర్వహించి, 45,64,527 విత్తన బంతులు చల్లారు. ఇప్పటి వరకు 1.79 సీడ్బాల్స్ చల్లగా.. ఇంకా 28.39లక్షలు విత్తనబంతులు చల్లాల్సి ఉంది. పాలమూరు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్తో సహా జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆదివారం ఉపాధి హామీ సిబ్బందితో హరితయాత్ర కార్యక్రమం జరుగనుంది.