నిజామాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘దేశంలో 80 శాతం మంది పేదలున్నరు. 20 శాతం మంది పెద్దలున్నరు. బీజేపీ ఎవరి వైపు? 80 శాతం మంది పేదల వైపా? 20 శాతం మంది పెద్దల వైపా? సామాన్యులపై భారం మోపి, బడా వ్యాపారవేత్తలకు దోచిపెడుతూ 80-20 గేమ్ ఆడుతున్నదెందుకు?’ అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు నిలదీశారు. బడా వ్యాపారవేత్తల రుణాలను రూ.11 లక్షల కోట్ల మేర మాఫీ చేసిన బీజేపీ ప్రభుత్వం.. రైతులు, మహిళలు, యువత కోసం పైసా ఖర్చు చేయలేదని విమర్శించారు. విశ్వసనీయతకు పెట్టింది పేరుగా నిలిచిన ఎల్ఐసీని అమ్మకానికి పెట్టారని, ఇందులో పెద్ద అవినీతి జరుగుతున్నదని ఆరోపించారు. శుక్రవారం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలో మంత్రి హరీశ్రావు పర్యటించారు.
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్లో రూ.40 కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కాలేజీ నూతన భవనానికి, నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలో రూ.69 కోట్లతో చేపట్టిన జాకోరా ఎత్తిపోతల పథకానికి స్పీకర్తో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు సభలో మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎందుకు పాదయాత్ర చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. ‘నేను తెలంగాణ యువత, నిరుద్యోగుల తరఫున బండి సంజయ్ని ఒక్కటే ప్రశ్న అడుగుతున్న. కేంద్రం పరిధిలో ఖాళీగా ఉన్న 15.40 లక్షల ఉద్యోగాలను ఎప్పటిలోగా భర్తీ చేస్తారో చెప్పాలి’ అని ప్రశ్నించారు. వాటిని భర్తీ చేస్తే కనీసం లక్ష ఉద్యోగాలైనా తెలంగాణ యువతకు దక్కుతాయని, వాటి కోసం కేంద్రంపై బండి పోరాడాలని హితవు చెప్పారు.
‘ఏడేండ్లలో రైల్వేశాఖలో ఒక్క ఉద్యోగం కూడా బీజేపీ ప్రభుత్వం భర్తీ చేయలేదు. రైల్వేలో 3 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, రిటైర్ అయినవారిని ఇంటికి పంపుడే తప్ప నింపుడు లేదు. బుల్లెట్ రైలు తెస్తామన్నరు. కానీ, రైల్వేలు అమ్ముడు, రైల్వే లైన్లు తాకట్టు పెట్టుడుకే కేంద్రం ప్రాముఖ్యతనిస్తున్నది. కేంద్ర భద్రత బలగాల్లోనూ లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వాటి జోలికి పోకుండా యువతను హిందూ, ముస్లిం గొడవలతో రెచ్చగొడుతున్నరు’ అని ధ్వజమెత్తారు. ఎల్ఐసీ, విశాఖ ఉక్కు, బీపీసీఎల్ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మి, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను కేంద్రం కాలరాస్తున్నదని మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కారు వచ్చాక 2.40 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని హరీశ్రావు స్పష్టం చేశారు.
రాహుల్ ఐరన్ లెగ్
‘రాహుల్ గాంధీ వస్తడు. తెలంగాణను ఉద్ధరిస్తడు అని అంటున్నరు. ఆ రాహుల్ది ఐరన్ లెగ్. ఆయనెక్కడ కాలుపెడితే అక్కడ కాంగ్రెస్ ఖతమైంది, ఓడింది తప్ప కాంగ్రెస్ గెలిచింది ఉన్నదా? అధికారంలో ఉన్న పంజాబ్ కూడా చేజారిపోయింది. యూపీలో ఒక్క సీటు కూడా గెలవలేదు. హర్యానాలో పత్తా లేదు. ఇక తెలంగాణను ఉద్ధరిస్తరా?’ అని కాంగ్రెస్పై మంత్రి హరీశ్ విమర్శలు గుప్పించారు. దేశంలో ఇటీవల జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడింది 94 శాతం, గెలిచింది 6 శాతమేనని, ఆ పార్టీది ఒడిసిన చరిత్ర అని ఎద్దేవా చేశారు. ఢిల్లీకి గులాంగిరి చేసే కాంగ్రెస్, బీజేపీ కావాలా? తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టే టీఆర్ఎస్ కావాలా? అని రైతులను అడిగారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానన్న బీజేపీ.. పెట్టుబడి ఖర్చులను రెట్టింపు చేసిందని విమర్శించారు. డీజిల్, ఎరువుల ధరలు పెంచిందని వెల్లడించారు. ‘నల్ల చట్టాలు తెచ్చి అంబానీ, అదానీలకు మన భూములు అప్పగించి ఆ భూముల్లో రైతులను కూలీలుగా మార్చేందుకు మోదీ కుట్రలు చేసిండు’ అని ఆరోపించారు. రైతుకు నష్టం రావొద్దని ధాన్యం కొనుగోళ్లలో నూక నష్టం రూ.3 వేల కోట్లు వచ్చినా భరించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.
స్పీకర్ చెప్పిన ఆర్మూర్ సిద్ధాంతం
సభలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి ఆర్మూర్ సిద్ధాంతాన్ని వివరించారు. ‘ఆర్మూర్, బాల్కొండ నియోజక వర్గాల్లోని మగవాళ్లు తమ సంపాదనను మహిళలకే అప్పగిస్తారు. పైసా అవసరమున్నా వారి నుంచే అడిగి తీసుకొంటారు. మహిళలకు వారిచ్చే గౌరవం వల్లే ఆ రైతుల ఇండ్లల్లో లక్ష్మీదేవి నిలకడగా ఉంటున్నది. ఇది వాస్తవం’ అని చెప్పారు. రైతులు లాభాలు వచ్చే పంటలే వేయాలని, ఆయిల్పామ్కు మంచి డిమాండ్ ఉన్నదని వివరించారు.
నిజాంసాగర్కు కాళేశ్వరం నీటి తరలింపుతో ఈ ప్రాంతంలో సాగు నీటి గోస తీరిందని తెలిపారు. నిజాంసాగర్ ఆయకట్టు రైతులంతా కేసీఆర్కు రుణపడి ఉంటారని అన్నారు. కార్యక్రమంలో సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జీవన్రెడ్డి, జాజాల సురేందర్, నిజామాబాద్, కామారెడ్డి జడ్పీ చైర్మన్లు దాదన్నగారి విఠల్రావు, దఫేదార్ శోభ, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.