హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): విస్తృత అధ్యయనం, ముక్కుసూటిగా మాట్లాడే నైజం సీపీఐ సీనియర్ నేత చాడ వెంకట్రెడ్డి సొంతమని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. చాడ వెంకట్రెడ్డి శాసనసభలో చేసిన ప్రసంగాలతో రూపొందించిన ‘అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం’ పుస్తకాన్ని బుధవారం అసెంబ్లీ కమిటీహాల్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ఈ పుస్తకం కొత్తగా సభకు వచ్చే సభ్యులకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. 610 జీవోపై నిర్వహించిన శాసనసభపక్ష సమావేశానికి తాను, చాడ వెంకట్రెడ్డి గంట ముందుగానే వెళ్లి ప్రిపేర్ అయ్యామని గుర్తు చేసుకొన్నారు. తాను ‘తెలంగాణకు అడ్డం కాదు.. పొడుగు కాదు’ అని వైఎస్ అంటే.. చాడ వెంటనే లేచి ‘..కానీ వంకర ఉన్నావు’ అని వ్యంగ్యంగా సమాధానం చెప్పారని గుర్తుచేశారు. శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. ముక్కుసూటిగా మాట్లాడే చాడ వెంకట్రెడ్డి ప్రసంగాలను ఆసక్తిగా వినేవాడినని చెప్పారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకే కేసీఆర్తో కలిసి పోరాటం: తమ్మినేని వీరభద్రం
దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియను కాపాడేందుకు సీఎం కేసీఆర్తో కలిసి పోరాటం చేస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. దేశంలో ఎక్కడా చట్టసభలు ఉండకూడదనే కుట్ర సాగుతున్నదని, దీనిని కలిసికట్టుగా తిప్పికొట్టాలని సూచించారు. పుస్తక రచయిత చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న 2004-09 ఉద్యమాలకు గోల్డెన్ పీరియడ్ అని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తామని చెప్పారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, పార్టీ సీనియర్ నేత పల్లా వెంకట్రెడ్డి, ఐజేయూ జాతీయ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్టు కే శ్రీనివాస్రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
సభా విలువలు కాపాడిన చాడ: పోచారం
శాసనసభ విలువలను కాపాడిన వ్యక్తి చాడా వెంకట్రెడ్డి అని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి కొనియాడారు. తాను మొదటిసారి సభకు వచ్చినపుడు సీనియర్ల ప్రసంగాలను వినేవాడినని, కమ్యూనిస్టు సభ్యులు విలువలతో కూడిన అంశాలపై మాట్లాడేవారని గుర్తుచేశారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. కమ్యూనిస్టు నాయకుల్లో తనకు బాగా ఆత్మీయత ఉన్న నేత రాఘవరెడ్డి అని, ఆయన ప్రసంగాలు కూడా ప్రచురితం కావాలని ఆకాంక్షించారు. ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి మాట్లాడుతూ.. తాను స్పీకర్గా పనిచేసిన సభలో 12 పార్టీలు ఉండేవని, అప్పట్లో సభను కామన్సెన్స్ నడిపిందని వివరించారు. చట్టసభల్లో అర్థవంతమైన చర్చల ద్వారానే ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సీపీఐ నేత సురవరం సుధాకర్రెడ్డి అన్నారు.