హైదరాబాద్, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి పైసా లబ్ధిదారులకు చేరేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల ఆడిటింగ్ ఆన్లైన్లో వందకు వంద శాతం జరిగే దిశగా అడుగులు వేయాలని ఆదేశించారు. ఆర్థిక శాఖ హెచ్వోడీలు, జిల్లాస్థాయి ఆర్థిక, ఆడిట్ అధికారులతో హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో మంగళవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. పంచాయతీల్లో వందశాతం ఆన్లైన్ ఆడిట్ చేసిన రాష్ట్రంగా తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు పొందడంపై హర్షం వ్యక్తంచేశారు. ఇకపై ఆన్లైన్ ఆడిటింగ్తో పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పూర్తిస్థాయిలో రికవరీ, అభ్యంతరాలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. రంగారెడ్డి జిల్లాలో గడిచిన మూడు నెలల్లో 2,400 అభ్యంతరాలను ఆడిట్ చేసి, పరిష్కరించడం ద్వారా ప్రభుత్వ ఖజనాకు రూ.1.26 కోట్లు జమ అయ్యాయనని చెప్పారు. ఇందుకు కృషిచేసిన జిల్లా అదనపు కలెక్టర్, ఆడిట్ సిబ్బందిని అభినందించారు. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లోనూ ఆడిట్ సమావేశాలు నిర్వహించి, అభ్యంతరాలను పరిష్కరించాలని ఆదేశించారు. ఐదారు నెలల్లో శాఖలవారీగా అభ్యంతరాలను పూర్తిగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నిధుల దుర్వినియోగం జరిగిందా, లేదా? అనేది పకడ్బందీగా ఆడిట్ చేయాలని సూచించారు. తొలుత రంగారెడ్డి జిల్లాలో అన్ని శాఖల ఆన్లైన్ ఆడిటింగ్ను ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని ఆదేశించారు. ఆడిట్ డిపార్ట్మెంట్ గౌరవం మరింత పెరిగేలా పనిచేయాలని, ఎలాంటి సహకారం కావాలన్న ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక సలహాదారు జీఆర్రెడ్డి, ఆర్థికశాఖ కార్యదర్శులు శ్రీదేవి, రోనాల్డ్రోస్, ఆర్థిక శాఖ విభాగాధిపతులు, అన్ని జిల్లాల ఆడిటింగ్ అధికారులు పాల్గొన్నారు.