ఉదయ్పూర్ లో దర్జీగా పనిచేసుకుంటున్న కన్హయ్యలాల్ పై ఇద్దరు దుండగులు హత్యకు పాల్పడ్డ ఘటనపై దేశమంతా ముక్తకంఠంతో ఖండిస్తున్నది. ఈ హేయమైన చర్యపై పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు కూడా స్పందిస్తున్నారు. ఘటనను ఖండిస్తూనే నేరస్తులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్, ప్రస్తుతం ఆప్ నేతగా ఉన్న హర్భజన్ సింగ్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ.. ‘ఉదయ్పూర్ ఘటన నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ హేయమైన చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నాగరిక సమాజంలో ఇటువంటి ఘటనలకు చోటు లేదు. నేరస్తులను కఠినంగా శిక్షించాలి..’ అని డిమాండ్ చేశాడు.
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ బహిష్కృత నేత నుపుర్ శర్మ కు సోషల్ మీడియాలో మద్దతు తెలిపినందుకు గాను కన్హయ్యలాల్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా స్పందించాడు.
‘మీరు ఏ విశ్వాసాలను అనుసరించినా ఫర్వాలేదు. కానీ అమాయకుల జీవితాలను బాధపెట్టకండి. అలా చేస్తే మొత్తం మానవాళిని బాధపెట్టినట్టే..’ అని ట్వీట్ చేశాడు. మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ స్పందిస్తూ.. ‘ఉదయ్పూర్ లో జరిగిన ఘటన బాధాకరం. అందరూ సహనం పాటించండి. ఈ ఘటనలో నిందితులపై చట్టం కఠిన చర్యలు తీసుకోవాలి..’ అని ట్వీట్ లో పేర్కొన్నాడు.
The #UdaipurHorror incident has shaken me from inside. I strongly condemn the heinous crime which has no place in any civilized society. There should be strict and swift action against the perpetrators of the crime.
— Harbhajan Turbanator (@harbhajan_singh) June 29, 2022
No matter which faith you follow. HURTING AN INNOCENT LIFE IS LIKE HURTING THE WHOLE HUMANITY.
— Irfan Pathan (@IrfanPathan) June 28, 2022