రాష్ట్ర ప్రభుత్వం ‘నేతన్న బీమా’ పథకం ప్రారంభించడంపై జిల్లా వ్యాప్తంగా నేత కార్మికుల సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. పటాకలు కాల్చి, స్వీట్లు పంచి ఆనందంలో మునిగితేలారు. మరోవైపు జిల్లావ్యాప్తంగా పద్మశాలీ సంఘాల ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు ఘనంగా సాగాయి. పలుచోట్ల భారీ ర్యాలీలు తీశారు. చేనేత కార్మికులను, పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ చూపిన పద్మశాలీ విద్యార్థులను సన్మానించి నగదు, జ్ఞాపికలు అందజేశారు. మంత్రి ఈశ్వర్తో పాటు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
నమస్తే నెట్వర్క్, ఆగస్టు 7: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నకు బీమా పథకం అమలుపై నేత కార్మికులు, టీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు జరుపుకున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రం, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తా, గర్శకుర్తిలో పటాకులు కాల్చి ఆనందంలో మునిగితేలారు. సిరిసిల్ల పాత బస్టాండ్ సమీపంలోని నేతన్న విగ్రహం వద్ద సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అలాగే కరీంనగర్ జిల్లా మధురానగర్ చౌరస్తా, గర్శకుర్తిలో చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ నేతృత్వంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆయాచోట్ల నాయకులు మాట్లాడారు. నేతన్నకు బీమాతో కార్మిక కుటుంబాలకు భరోసా లభిస్తుందని చెప్పారు. ఈ స్కీంను అమల్లోకి తీసుకువచ్చిన సర్కారుకు కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు జాతీయ చేనేత దినోత్సవాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ర్యాలీలు నిర్వహించి, నేత కార్మికులను సన్మానించారు. పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పద్మశాలీ విద్యార్థులకు బహుమతులు అందజేశారు. జగిత్యాల పట్టణంలోని చేనేత సహకార సంఘంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ అధ్యక్షతన నిర్వహిచగా, మంత్రి కొప్పుల ఈశ్వర్ మార్కండేయ చిత్ర పటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇక్కడ కోరుట్ల, చొప్పదండి ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్రావు, సుంకె రవిశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేత కార్మికులను సన్మానించారు.