తిరుపతి జిల్లా : అధికారుల తప్పిదంతో ఓ వికలాంగుడి పెన్షన్ రద్దయింది. దాంతో జగన్కు ఓటేసి తప్పుచేశానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఊరుకోక సెంటర్లోకొచ్చి చెప్పుతో కొట్టుకున్నాడు. తన కష్టాలను ఈ ప్రభుత్వం పరిష్కరించడం లేదంటూ తీవ్ర ఆవేదన చెందాడు.
వివరాల్లోకెళితే.. వెంకటగిరి పరిధిలోని వెలంపాళెం నివాసి వెంకటేశ్వర్లు వికలాంగుడు. కాళ్లు రెండూ పనిచేయవు. వంకర తిరిగిన చేతులతో ఏ పనీ చేతకాదు. గతంలో ఈయనకు మంజూరైన పెన్షన్ను కారణాలు చెప్పకుండా రద్దు చేశారు. దాంతో వెంకటేశ్వర్లుకు ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. తెలిసిన వారి దగ్గర చేయి చాపడం ఇబ్బందికరంగా మారింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగం చేసే తమ్ముడి వద్ద ఉంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి ఇంట్లో ఉన్నందునే తనకు పెన్షన్ రద్దు చేశారని వెంకటేశ్వర్లు ఆరోపిస్తున్నారు. ఎన్నిసార్లు వేడుకున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో జగన్కు ఓటేసి తప్పు చేసినందుకు పశ్చాతాపంగా వెంకటేశ్వర్లు, తన సోదరుడితో కలిసి వచ్చి సెంటర్లో చెప్పుతో కొట్టుకుని తమ నిరసన తెలిపారు.
ఇద్దరి పేర్లు ఒకే రేషన్ కార్డులో ఉన్నందునే తన సోదరుడికి పెన్షన్ తొలగించారని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని తన అన్నకు పెన్షన్ తిరిగి ఇచ్చేలా చూడాలని వెంకటేశ్వర్లు తమ్ముడు నర్సింహులు ప్రాధేయపడుతున్నాడు. తమ అన్నకు వేరుగా రేషన్కార్డు ఇప్పించి పింఛను అందేలా చూడాలని కోరుకుంటున్నాడు.