న్యూఢిల్లీ : కంప్యూటర్ హ్యాకర్లు గత మూడు నెలలుగా ఆందోళన చేస్తున్న రైతులకు మద్దతుగా నిలిచారు. ఇందుకోసం సైబర్ నేరగాళ్లు ప్రత్యేక శైలిని ఎంచుకుని ప్రశంసలు అందుకుంటున్నారు. కొత్త ర్యాన్సమ్వేర్ను రూపొందించుకున్న సైబర్ నేరస్థులు దేశంలోని పలు కంప్యూటర్లపై సరికొత్త దాడిని ప్రారంభించారు. వీరు ఈ మాల్వేర్ ఆధారంగా సాధారణంగా సంస్థలు, వ్యక్తులను పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తుంటారు. అయితే, ఇక్కడ మాత్రం కేంద్ర కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు బాసటగా నిలవండి అంటూ వారు కోరుతుండటం విశేషం. సైబర్ నేరస్థులు ఈ విధంగా రైతు సమాజానికి సేవ చేస్తుండటం యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్శించారు.
వివిధ సంస్థల్లోని కంప్యూటర్లు బుధవారం ర్యాన్సమ్వేర్కు గురైనట్లు గుర్తించారు. రైతుల నిరసనలతో అనుసంధానమై ఉన్న సంస్థలను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరస్థులు ఈ మాల్వేర్కు రూపకల్పన చేశారు. వంద రోజులకు పైగా ఆందోళన చేస్తున్న రైతులకు అండగా నిలువాలని హ్యాకర్స్ ఈ ర్యాన్సమ్వేర్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. ఖల్సా సైబర్ ఫౌజ్ అనే హ్యాకర్.. దేశంలో సమూహ దాడికి నాయకత్వం వహించినట్లు సైబర్ నిపుణుల నివేదికలు వెల్లడించాయి. రైతుల డిమాండ్లు తీరే వరకు డాటా తిరిగి రాదు అనే సందేశాన్ని ఈ మాల్వేర్ ద్వారా ఆయా సంస్థలకు తెలియజేశారు. ఇది ‘సర్బ్లోహ్’ అని పిలుచుకునే మాల్వేర్ను క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్ కనుగొన్నది. ఇది హానికరమైన వర్డ్ డాక్యుమెంట్ల ద్వారా, ఈ-మెయిళ్ళ ద్వారా పంపిణీ చేస్తున్నారు. రైతులకు మద్దతు ఇచ్చే రాజకీయ సందేశాన్ని కలిగి ఉన్నదని, తాజా ‘సర్బ్లోహ్’ ర్యాన్సమ్వేర్.. వారి పెరుగుతున్న దాడి సామర్థ్యాలకు నిదర్శనం అని క్విక్ హీల్ సెక్యూరిటీ ల్యాబ్స్ డైరెక్టర్ హిమాన్షు దూబే అన్నారు.
ఆశ్చర్యకరంగా, ఈ కొత్త దాడి టెక్నిక్ ద్వారా బెదిరింపులకు దిగుతున్నవారు ర్యాన్సమ్ అడగకుండానే వారి ఫైళ్ళను ఎన్క్రిప్టింగ్ ద్వారా వినియోగదారుల పరికరాలకు సోకుతున్నారు. ‘ఖల్సా సైబర్ ఫౌజ్’ సిస్టం ఫైళ్ళలో మిలిటరీ-గ్రేడ్ ఎన్క్రిప్షన్ను పనికిరానిదిగా ఉపయోగిస్తున్నదని కంపెనీ పేర్కొన్నది. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనను తీవ్రతరం చేయడమే కాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫాంలపై కూడా కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులను ఉద్యమించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
2020 నవంబర్ 26 నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఈ-మెయిల్లు, సందేశాల నుంచి వచ్చే అటాచ్మెంట్లను డౌన్లోడ్ చేయవద్దని క్విక్ హీల్ సెక్యూరీటీ ల్యాబ్స్ వినియోగదారులకు సూచించింది.