లండన్, జూన్ 11: జీవీకే గ్రూప్ సబ్సిడరీ జీవీకే కోల్ డెవలపర్స్ (సింగపూర్) చెల్లించాల్సిన రుణంపై ఆరు భారతీయ బ్యాంక్లు లండన్ హై కోర్టులో కేసు దాఖలు చేసినట్లు సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్- ఈ ఆరింటికి కలిపి 1.5 బిలియన్ డాలర్ల (రూ.12,114 కోట్లు) రుణాన్ని వడ్డీతో కలిపి జీవీకే కోల్ డెవలపర్స్ చెల్లించాల్సి ఉంది. ఈ రుణాలకు గ్యారంటార్లుగా ఉన్న తొమ్మిది జీవీకే గ్రూప్ కంపెనీలపై (ఏడు సింగపూర్ సంస్థలు, రెండు సికింద్రాబాద్ కంపెనీలు) కూడా బ్యాంక్లు దావా వేశాయి. ఈ కేసు సోమవారం విచారణకు రానుంది. 2011లో జీవీకేకు బ్యాంక్లు 1 బిలియన్ డాలర్ల రుణం జారీ, 35 మిలియన్ డాలర్ల లెటర్ ఆఫ్ క్రెడిట్ సదుపాయం కల్పించడంతోపాటు 2014లో 160 మిలియన్ డాలర్లకుపైగా రుణం ఇచ్చిన అంశంపై ఈ వివాదం ఏర్పడింది. ఇదిలావుంటే తాము ఏ ఒప్పందాల్ని ఉల్లంఘించలేదని, 1.5 బిలియన్ డాలర్ల రుణ బకాయిలు ఉన్నాయన్న వాదనను జీవీకే ఖండించింది.