నల్లగొండ: దేశంలోని రైతులందరినీ ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంపై కక్షపూరిత విధానాన్ని కేంద్ర ప్రభుత్వం మానుకోవాలని సూచించారు. నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్గా తనను రెండోసారి ఎన్నుకున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ధాన్యం కొనుగోలుపై రాష్ట్రంలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు కేంద్రం మానుకోవాలన్నారు. పంజాబ్లో మాదిరిగానే తెలంగాణలోనూ మొత్తం ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. యాసంగి ధాన్యం కొనుగోలు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం మార్గం చూపించాలన్నారు. రా రైస్, బాయిల్డ్ రైస్ అనే తేడా లేకుండా వడ్లను కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్లను కొని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నదని, దాన్నీ ఏ రైస్ మార్చుకోవలన్నది కొన్న తర్వాత కేంద్రం నిర్ణయించుకోవచ్చని సూచించారు.